Shireen Abu Akleh: ఇజ్రాయెల్ కాల్పుల్లో రిపోర్టర్ మృతి
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్బ్యాంకులోని జెనిన్ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో అల్ జజీరా ఛానెల్కు చెందిన మహిళా జర్నలిస్టు మృతి చెందారు. బుధవారం ఉదయం షిరీన్ అబు అఖ్లే అనే మహిళా జర్నలిస్టు స్థానికంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులను రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
- Narender Thiru
- Published On : May 11, 2022 / 04:32 PM IST
Shireen Abu Akleh
Shireen Abu Akleh: ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్బ్యాంకులోని జెనిన్ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో అల్ జజీరా ఛానెల్కు చెందిన మహిళా జర్నలిస్టు మృతి చెందారు. బుధవారం ఉదయం షిరీన్ అబు అఖ్లే అనే మహిళా జర్నలిస్టు స్థానికంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులను రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో మరో జర్నలిస్టు కూడా గాయపడ్డారు. షిరీన్.. పాలస్తీనా మూలాలున్న అమెరికన్ జర్నలిస్టు. వెస్ట్బ్యాంకు ప్రాంతంలో కొంతకాలంగా పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. షిరీన్ ఈ దాడులను చాలా కాలంగా రిపోర్టింగ్ చేస్తోంది. తాజాగా ఆమె రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో జర్నలిస్టు అని రాసి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ధరించింది.
అయితే, ఆమె తలపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై పాలస్తీనా మండిపడింది. షిరీన్ మరణాన్ని ఇజ్రాయెల్ చేసిన హత్యగా వర్ణించింది. దీనిపై ఇజ్రాయెల్లోని అమెరికన్ రాయబారి కూడా విచారం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై విచారణ జరపాలని కోరాడు. అయితే, ఈ ఘటన విషయంలో తమ దళాలపై వస్తున్న విమర్శలను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. పాలస్తీనా దళాలే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు గాయపడ్డ జర్నలిస్టు అలీ సమూది మాత్రం ఇజ్రాయెల్ దళాలు ఉన్నట్లుండి కాల్పులు జరపడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చింది.
