Rythu Bandhu 2021: కొత్తగా మరో 2.22 లక్షల మందికి రైతు బంధు!
దేశంలో మరెక్కడా లేనివిధంగా ఎకరాల లెక్కన రైతులకు ఆర్ధిక చేయూతనిస్తూ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా చాలా రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు అమలవుతున్నా.. ఎన్ని ఎకరాలున్న రైతైనా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల సాయం అందించడం మాత్రమే ఒక్క తెలంగాణలోనే సాధ్యమవుతుంది.
- Naresh Mannam
- Published On : June 13, 2021 / 01:47 PM IST
Rythu Bandhu 2021
Rythu Bandhu 2021: దేశంలో మరెక్కడా లేనివిధంగా ఎకరాల లెక్కన రైతులకు ఆర్ధిక చేయూతనిస్తూ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా చాలా రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు అమలవుతున్నా.. ఎన్ని ఎకరాలున్న రైతైనా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల సాయం అందించడం మాత్రమే ఒక్క తెలంగాణలోనే సాధ్యమవుతుంది. 2018 వానాకాలం(ఖరీఫ్) సీజన్ నుంచి ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో ఏడాదికి రెండు పంటల చొప్పున ఒక్కోపంటకు తొలిసారి ఎకరానికి రూ.4 వేలు ఇచ్చారు.
2019 వానాకాలం నుంచి ఎకరాకు రూ.5 వేలకు పెంచగా ఇప్పుడు ఏడాదికి రెండు పంటలకు కలిపి ఎకరాకు పదివేల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమవుతున్నాయి. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు సాయం అందనుంది. కాగా, ప్రస్తుత వానాకాలంలో రైతుబంధు పథకానికి కొత్తగా మరో 2.22 లక్షల మంది రైతులు అర్హులైననట్లు తేలింది. రెవెన్యూ రికార్డుల్లో భూమి ఖాతాల ప్రకారం పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ విభాగంలోకి మారిన రైతులు కొత్తగా అర్హుల జాబితాలోకి వచ్చారని రెవెన్యూశాఖ తెలిపింది.
గత యాసంగిలో 59.33 లక్షల మందికి రైతుబంధు సొమ్ము అందగా కొత్తగా 2.22 లక్షల మంది చేరడంతో ఈ సీజన్లో సొమ్ము అందుకునేవారి సంఖ్య 61.55 లక్షలుంటుందని ప్రాథమిక అంచనా. ఈ నెల 10 వరకూ భూములను కొన్న రైతులను పథకంలో నమోదు చేయాల్సి ఉండగా అప్పటి వరకూ మొత్తం 2.22 లక్షల మంది రైతులను పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ ఖాతాల్లోకి మార్చినట్లు రెవెన్యూశాఖ వెల్లడించింది. వీరి పేర్లకు ఎదురుగా బ్యాంకు పొదుపు ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు, దాని ఐఎఫ్ఎస్సీ కోడ్ రైతుబంధు పోర్టర్ లో నమోదు చేయాల్సి ఉండగా ఏఈఓలే గ్రామస్థాయిలో పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది.
