Assam floods: అసోంలో వరదలు.. ముగ్గురు మృతి
ఒకవైపు దేశంలోని అనేక రాష్ట్రాలు ఎండలు, వడదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అసోం మాత్రం వరదల్లో చిక్కుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు అసోంలోని ఆరు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.
- Narender Thiru
- Published On : May 15, 2022 / 01:32 PM IST
Assam Floods
Assam floods: ఒకవైపు దేశంలోని అనేక రాష్ట్రాలు ఎండలు, వడదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అసోం మాత్రం వరదల్లో చిక్కుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు అసోంలోని ఆరు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ వరదల ప్రభావానికి దాదాపు 25,000 మంది ప్రజలు నిరాశ్రయులవ్వగా, ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 94 గ్రామాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడేందుకు ఆర్మీ, పారా మిలిటరీ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. డిమా హసావో జిల్లాలో కొండచరియలు విరిగి పడటంతో ముగ్గురు చనిపోయారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్నారా?
పలు ఇండ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల ప్రభావంతో పలు నదుల్లో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో అసోంలో వరదలు రావడం ఇదే తొలిసారి. అసోంతోపాటు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లో కూడా రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అకాల వర్షాల కారణంగా దాదాపు 1,732 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది కూడా అసోంలో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల ప్రభావానికి దాదాపు ఆరున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో ప్రధాన నది అయిన బ్రహ్మపుత్ర పొంగడం వల్ల కూడా వరదల తీవ్రత పెరుగుతోంది.
