Corona Vaccine: వ్యాక్సిన్స్ సరఫరా చేయలేదని సీరంకు ఆస్ట్రాజెనెకా నోటీసులు!
మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కొంతమంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడంలో మాత్రం ముందుకురావడం లేదు. ఒకవైపు దేశంలో వ్యాక్సిన్ తయారీ కంపెనీలు మన దేశానికే ప్రాధాన్యత ఇస్తూ ఇతర దేశాలకు సరఫరాను తగ్గిస్తుంది. తాజాగా తమకు చేసుకున్న ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ సరఫరా చేయలేదని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఆస్ట్రాజెనెకా లీగల్ నోటీసు జారీ చేసింది.
- Naresh Mannam
- Published On : April 8, 2021 / 12:42 PM IST
Corona Vaccine
AstraZeneca : మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కొంతమంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడంలో మాత్రం ముందుకురావడం లేదు. ఒకవైపు దేశంలో వ్యాక్సిన్ తయారీ కంపెనీలు.. భారత ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీలో మన దేశానికే ప్రాధాన్యత ఇస్తూ ఇతర దేశాలకు సరఫరాను తగ్గిస్తుంది. గతంలో ఇతర దేశాలకు.. ఆ దేశాలలోని కంపెనీలకు వ్యాక్సిన్ సరఫరాకు చేసుకున్న ఒప్పందాలను అధిగమించి మరీ మన దేశంలో అధికంగా సరఫరా చేస్తుంది. దీంతో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా తమకు చేసుకున్న ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ సరఫరా చేయలేదని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఆస్ట్రాజెనెకా లీగల్ నోటీసు జారీ చేసింది.
తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అనుకున్న సమయానికి తమకి వ్యాక్సిన్ సరఫరా చేయలేదని ఆస్ట్రాజెనెకా ఈ నోటీసులు జారీచేసింది. ఈ విషయాన్ని సీరం కంపెనీ సీఈఓ పునావాలా ధ్రువీకరించగా.. ఈ విషయం భారత ప్రభుత్వానికి సైతం తెలుసునని సమస్యను పరిష్కరించేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్లో వ్యాక్సిన్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేకపోయినట్లు పూనావాలా తెలిపారు. దేశంలో పెరుగుతున్న కేసులతో ఉత్పత్తి సామర్థ్యం ఒత్తిడికి గురవుతోందని.. దేశంలోనే ఎక్కువ సరఫరా చేయాల్సి రావడంతో ఇతర దేశాలకు సరఫరాలపై విరామం ఇచ్చినట్లు పూనావాలా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
నిజానికి ఇతర దేశాలలో వ్యాక్సిన్ మోతాదులను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నా.. మన దేశంలో వ్యాక్సిన్ తక్కువ ధరకే అందిస్తున్నా.. ముందుగా మన భారత్ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, భారతీయుల కోసం ఇవ్వగలిగిన తక్కువ ధరకు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇండియాలో సబ్సిడీ రేట్లకు అందిస్తూ.. వ్యాక్సిన్లపై లాభాలు సంపాదించడం లేదని.. ముందుగా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశానికే అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని పూనావాలా చెప్పారు. ఆస్ట్రాజెనెకా నోటీసులపై ప్రభుత్వ చర్యల కోసం వేచి ఉన్నామని ఆయన వివరించారు.
