Boat Accident: బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పద్మ నదిలో దాదాపు 30 మంది ప్రయాణిస్తున్న ఓ పడవను ఇసుక రవాణా చేస్తోన్న మరో పడవ ఢీ కొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా గల్లంతయ్యారు. అందులో 26 మంది జలసమాధి కాగా మిగిలిన వారిని కాపాడినట్లు స్థానిక పోలీసు అధికారి మిరాజ్ హుస్సేన్ తెలిపారు. గల్లంతైన వారిలో కొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉండగా అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం గాలిస్తున్నారు.
పడవ నిర్వహణ సరిగా లేకపోవడం, సామర్థ్యానికి మించి పడవలో ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో నారాయణగంజ వద్ద 50 మందితో వెళ్తోన్న ఓ పడవ బోల్తాపడిన ఘటనలో 30 మంది మరణించారు. గత ఏడాది జూన్లోనూ ఢాకా సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 32 మంది జలసమాధి అయ్యారు. 2015 ఫిబ్రవరిలో జరిగిన షిప్ ప్రమాదంలో 78 మంది మృత్యువాత పడ్డారు.
మన దేశం నుండి ప్రవహించే అనేక నదులు బంగ్లాదేశ్ వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. గంగా నదిని అక్కడ పద్మానది అని పిలుస్తారు. అయితే ఇక్కడ పడవ ప్రయాణాలలో నిర్వహణ సక్రమంగా లేకపోవడం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడంతోనే ప్రతి ఏడాది పదుల సంఖ్యలో మృత్యువాత పడుతుంటారు. మరోవైపు విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు.. జలమార్గంలో ఇసుక రవాణా కూడా జలప్రమాదాలకు కారణమవుతున్నట్లు కనిపిస్తుంది.
Read: Telangana Health Ministry: మంత్రులకు కలిసిరాని ఆరోగ్యశాఖ.. అప్పుడు రాజయ్య.. ఇప్పుడు ఈటల!