Covid 19 Vaccination: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి దేశాలు నానాతిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలకం వ్యాక్సినేషన్. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు ఇందులో విజయం సాధించగా చాలా దేశాలు దీన్నో యాగంగా చేపట్టాయి. మన దేశంలో కూడా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయగా ప్రజలకు కావాల్సిన స్థాయిలో అందుబాటులో లేవు. ఒకనాడు మన దేశంలో కూడా వ్యాక్సిన్ మీద ఆసక్తి చూపని ప్రజలలో ఇప్పుడు మార్పురాగా ఆ స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోయింది. అయితే, ఇప్పటికీ చాలా దేశాలతో వ్యాక్సిన్ అంటే ప్రజలలో అపోహలే ఉన్నాయి. అందులో హాంగ్ కాంగ్ కూడా ఒకటి.
హాంకాంగ్లో వ్యాక్సిన్లు తీసుకోవడానికి జనం ఆసక్తి చూపకపోవడంతో అక్కడి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సమాజం మీద అభిమానం ఉన్న కొందరు పెద్దలు కలిసి ప్రజలలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం భారీ బహుమతులను కూడా ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంగారు కడ్డీలు ఇస్తామని హెండర్సన్ ల్యాండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రకటించగా.. సన్ హ్యాంగ్ కాయ్ ప్రాపర్టీస్ అనే మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇప్పటికే ఐఫోన్లు ఇస్తుంది.
ఇక ఆస్ట్రేలియాకు చెందిన గుడ్మ్యాన్ గ్రూప్ అయితే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే లాటరీలో మిలియన్ హాంకాంగ్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది. ఇందుకు ఆగస్ట్ 31 డెడ్ లైన్ పెట్టింది. బ్లూమ్బర్గ్ అనే మరో కంపెనీ అయితే టెస్లా మోడల్ 3 కారు ఇస్తామని ప్రకటించింది. వీటితో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు షాపింగ్ వోచర్లు, రకరకాల సబ్సిడీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన బహుమతుల విలువ 12 కోట్ల హాంకాంగ్ డాలర్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు కూడా ఆఫర్లకు ఆకర్షితులై వ్యాక్సిన్ తీసుకొనేందుకు ముందుకు రావడంతో మరింతగా ఆఫర్లను ప్రకటిస్తున్నారు.