Chennai police : పుట్టింటికి వెళ్లలేకపోయిన మహిళా కానిస్టేబుల్కు సిబ్బంది పోలీస్స్టేషన్లోనే శ్రీమంతం చేశారు. తమిళనాడు చెన్నైలోని కే2 అయనవరం పోలీస్ స్టేషన్లో గర్భిణిగా ఉన్న మహిళా కానిస్టేబుల్ కు చేతినిండా గాజులు వేసి..గంధం పూసి..స్వీట్లు తినిపించారు పోలీస్ స్టేషన్ సిబ్బంది.అంతేకాదు స్టేషన్ కు ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వాళ్లందరికీ, స్టేషన్ పరిసరాల్లోని వాళ్లకు ఉచితంగా భోజనం కూడా పెట్టారు.
కే2 అయనవరం పోలీస్ స్టేషన్లో సౌమ్య అనే యువతి గ్రేడ్ 1 కానిస్టేబుల్గా పనిచేస్తోంది. ఆమెకు ఏడు నెలల గర్భిణి. శ్రీమంతానికి పుట్టింటికి వెళ్లాలని ఆశపడింది. తల్లిగారిది తిరువన్నమలై. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సౌమ్య పుట్టింటికి వెళ్లలేకపోయింది. గర్భంతో ఉన్న ప్రతీ మహిళా పుట్టింటివారితో శ్రీమంతం చేయించుకోవాలని ఆశపడుతుంది. కానీ నాకా అదృష్టం లేదని సౌమ్య బాధపడింది. ఈ విషయాన్ని తోటి మహిళా కానిస్టేబుళ్లు గుర్తించారు. సాటి మహిళగా శ్రీమంతం చేయించుకోవాలనే ఆశ ఉండటం సహజమేకదా..మరి మనం ఎందుకు ఆమెకు శ్రీమంతం చేయకూడదు అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎస్ ఐ మురుగేషన్ దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చారు.
ఆయన కూడా సరేనన్నారు. దీంతో శ్రీమంతానికి కావాల్సినవన్నీ తెచ్చారు. కొత్త చీరతో పాటు పండ్లు, స్వీట్లు తీసుకొచ్చారు. స్టేషన్లోనే సౌమ్యకు ఆదివారం (నవంబర్ 20వ తేదీన) కొత్తచీర, గాజులు కానుకగా ఇచ్చి, స్వీట్లు తినిపించారు. అంతేకాదు ఆరోజు ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వాళ్లందరికీ, స్టేషన్ పరిసరాల్లోని వాళ్లకు ఉచితంగా భోజనం పెట్టారు. పోలీసులు చేసిన ఈ శుభకార్యాన్ని స్థానికులంతా ప్రశంసించారు.
రెండేళ్లుగా అక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సౌమ్య తన పట్ల స్టేషన్ సిబ్బంది చూపించిన మమకారానికి పొంగిపోయింది. అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపింది.సేలంకు చెందిన సౌమ్య భర్త సత్యమూర్తి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. సత్యమూర్తిని కూడా శ్రీమంతం రోజున తీసుకొచ్చి సౌమ్య పక్కనే కూర్చోపెట్టి వేడుకను జరిపించారు స్టేషన్ సిబ్బంది.