China Sets Up 3 Villages Near Arunachal సరిహద్దులో చైనా ఆగడాలు రోజు రోజుకి పెచ్చు మీరుతున్నాయి. లడఖ్ నుంచి అరుణాచల్ప్రదేశ్ వరకు ఏదో ఒక చోట ఉద్రిక్తతలు పెంచే కార్యక్రమాలను డ్రాగన్ చేపడుతూనే ఉంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఏకంగా మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింది.
పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్ లోని భారత్- చైనా-భూటాన్ దేశాల ట్రై జంక్షన్ కి ఆనుకుని ఉండే బమ్ లా పాస్ కి 5 కిలోమీటర్ల దూరంలోనే 3 గ్రామాలను చైనా నిర్మించినట్లు తాజా శాటిలైట్ ఫొటోల్లో సృష్టంగా కనబడుతోంది. మూడు గ్రామాలను ఒక్కో కిలోమీటర్ దూరంలో అధునాతన రోడ్లతో అనుసంధానించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఆ ప్రాంతంలో 20 నిర్మాణాలతో తొలి గ్రామాన్ని నిర్మించినట్లు సమాచారం. ఆ తర్వాత నవంబర్ 28 నాటికి ఆ పక్కనే మరో రెండు గ్రామాలు వెలిశాయి. అందులో ఒక గ్రామంలో 50 వరకు నిర్మాణాలు ఉన్నాయి. 3,222 మందిని(960 కుటంబాలు)వలంటరీ బేసిస్పై ఈ గ్రామాలకు చైనా తరలించింది.
భౌగోళికంగా భారత్-భూటాన్-చైనాలకు ఆనుకుని ఉంటుంది ఈ బమ్ లా పాస్. దీన్ని ట్రై జంక్షన్గా పిలుస్తుంటారు. ఇది టిబెట్ రీజియన్ కిందికి వస్తుంది. టిబెట్ లోని కోనా కౌంటీ, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలను కలిపే రహదారి ఇది. తవాంగ్ టౌన్ నుంచి సరిగ్గా 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోనా కౌంటీ. ఈ బమ్ లా పాస్ సమీపంలోని కొంత భూభాగాన్ని ఎవరికీ చెందనదిగా భావిస్తుంటారు. అలాంటి ప్రదేశంలో చైనా కొత్తగా మూడు గ్రామాలను నిర్మించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, ఈ ప్రాంతంలో భారతదేశం మరియు చైనా మధ్య సరిహద్దును డ్రాగన్ వివాదం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ చైనా కొత్త నిర్మాణాలు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో దాని ప్రాదేశిక వాదనలను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన ముందడగుగా కనిపిస్తున్నాయి. అసలు మొత్తం అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ కొన్ని దశాబ్దాలుగా చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే.
అయితే,కొద్ది రోజుల క్రితం కూడా భూటాన్ భూభాగంలో చైనా ఓ గ్రామం నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు సృష్టం చేసిన విషయం తెలిసిందే. 2017లో భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్ఠంభణ నెలకొన్న డోక్లాం ప్రాంతానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే భూటాన్ భూభాగంలో చైనా ఆ గ్రామాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. మరోవైపు,లడఖ్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల మధ్య 8 దఫాలుగా చర్చలు జరిగినా ఉద్రిక్తతలు తగ్గని విషయం తెలిసిందే.