Justice NV Ramana: నేడు తిరుమలకు ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు జస్టీస్గా తొలిసారి!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుమలకు రానున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి చీఫ్ జస్టిస్ తిరుమల పర్యటన ఇదేకాగా శ్రీవారి దర్శనార్థం సతీసమేతంగా నేడు తిరుమలకు రానున్నారు.
- Naresh Mannam
- Published On : June 10, 2021 / 08:57 AM IST
Justice Nv Ramana
Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేడు తిరుమలకు రానున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి చీఫ్ జస్టిస్ తిరుమల పర్యటన ఇదేకాగా శ్రీవారి దర్శనార్థం సతీసమేతంగా నేడు తిరుమలకు రానున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుండి ముందుగా చెన్నైకి చేరుకోనున్న జస్టిస్ అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. రాత్రి తిరుమల కొండపైనే బస చేసి శుక్రవారం ఉదయం సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొననున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి తిరుమల రాకతో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా ఏప్రిల్ 11న స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీజేఐ హోదాలో నేడు తిరుమలకు రానున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి, టీటీడీకి పర్యటన వివరాలు అందగా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండగా బుధవారం తిరుమల శ్రీవారిని 11,770 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.34 కోట్లు కాగా.. 4,675 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
