Maharashtra Elections: కాంగ్రెస్ ఒంటరి పోరు.. మహా రాజకీయాల్లో పెను మార్పులు?
మహారాష్ట్ర రాజకీయాలలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కార్ లో అంతర్గత లుకలుకలు ఎవరికి వారే అన్న తీరులో కనిపిస్తుండగా శివసేన తిరిగి బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
- Naresh Mannam
- Published On : June 14, 2021 / 03:27 PM IST
Congress Is Fighting Alone Major Changes In Maharastra Politics
Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాలలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కార్ లో అంతర్గత లుకలుకలు ఎవరికి వారే అన్న తీరులో కనిపిస్తుండగా శివసేన తిరిగి బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాగా, మోదీపై శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదలా ఉండగానే కాంగ్రెస్ రానున్న ఎన్నికలలో ఒంటరిగా పోటీచేస్తుందని ప్రకటించి మరింత రాజకీయ వేడిపెంచింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటోలె పేర్కొన్నారు. ఒకవైపు శివసేన తిరిగి ఎన్డీఏలో చేరనుందని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ప్రకటించడం మహా రాజకీయాలలో ఆసక్తిగా మారగా అధిష్టానం అవకాశం ఇస్తే సీఎం అభ్యర్థిగా తానే ఉంటానంటూ నానా పటోలే ప్రకటించారు.
శివసేన ప్రయత్నాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రకటనతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమనే అభిప్రాయం నెలకొంది. జాతీయస్థాయిలో బీజేపీ మళ్ళీ మిత్రపక్షాలను దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తుందనే రాజకీయ వర్గాల విశ్లేషణల నేపథ్యంలో శివసేన పెద్దలు బీజేపీ నేతలతో కలవడంతో మారనున్న రాజకీయ సమీకరణాలను ముందే ఊహించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీకరణలకు అనుగుణంగానే ఈ ప్రకటన చేశారనిపిస్తుంది. అయితే.. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటున్నది చూడాల్సి ఉంది.
