congress: రాహుల్ గాంధీ పర్యటన.. సమావేశమైన టీపీసీసీ
వచ్చే నెలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ పర్యటనను విజయవంతం చేసే అంశంపై టీపీసీసీ సమావేశమైంది.
- Narender Thiru
- Published On : April 23, 2022 / 05:23 PM IST
Congrss
congress: వచ్చే నెలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ పర్యటనను విజయవంతం చేసే అంశంపై టీపీసీసీ సమావేశమైంది. శనివారం హైదరాబాద్లోని గాంధీ భవన్ (ఇందిరా భవన్)లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. రాహుల్ పర్యటన ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. వచ్చే నెల 6,7 తేదీల్లో జరిగే రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని నాయకులకు రేవంత్ సూచించారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదులో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
2002లో హన్మంతరావు ఆధ్వర్యంలో జరిగిన బీసీ గర్జన సభ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారని, సోనియా గాంధీ ఆ సభకు వచ్చి, కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చారని రేవంత్ గుర్తు చేశారు. అదేవిధంగా ఆరో తేదీన వరంగల్ నగరంలో జరిగే సభను కూడా విజయవంతం చేయాలని, ఈ సభ గురించి కూడా మరో ఇరవై ఏళ్లు మాట్లాడుకోవాలని సూచించారు. రైతులు కష్టాల్లో ఉన్నారని, రైతు సంఘర్షణ సభను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. మరోవైపు వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టి, టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
