దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అదనపు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి లబ్దిదారు కుటుంబాల్లో.. యజమాని పేరుతో దళితబంధు పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులకు ప్రత్యేక పాస్ బుక్ ను అందజేయాలని తెలిపింది.
అలాగే.. తాజా మార్గదర్శకాల ప్రకారం.. అర్హులకు.. వారి ఖాతాల్లో 9 లక్షల 90 వేల రూపాయల నిధులను జమ చేయాలి. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయాలి. పథకానికి ఎంపికైన వారు.. 10 లక్షల రూపాయల విలువైన ప్రతిపాదనలను సమర్పించాలి. చేయబోయే వ్యాపారానికి సంబంధించి.. 2 నుంచి 6 వారాల పాటు తగిన శిక్షణ పొందాలి.
ఇక.. ఇప్పటికే ఈ పథకాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రాంతాల వారీగా లబ్ధిదారుల ఎంపిక పనిలో అధికార యంత్రాగం నిమగ్నమైంది. మరోవైపు.. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో.. పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.