×
Ad

Electiricty With Bacteria : బ్యాక్టీరియా నుంచి విద్యుదుత్పత్తి

నీరు, బొగ్గు, కలపతో పాటు మరి కొన్ని శిలాజ ఇంధనాల ద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్నాము. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

  • Published On : September 4, 2021 / 09:53 PM IST

Electiricty generate with bacteria

Electiricty With Bacteria :  నీరు, బొగ్గు, కలపతో పాటు మరి కొన్ని శిలాజ ఇంధనాల ద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్నాము. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. దీంతో పర్యావరణహిత పునరుత్పాదక శక్తి వనరుల కోసం శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలను తీర్చడానికి.. క్లీన్‌ ఎలక్ట్రిసిటీ సరఫరాకు ఓ బ్యాక్టీరియా సాయపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

షెవనెల్లా ఓనెడెన్సిస్‌’ అనే బ్యాక్టీరియాతో పునరుత్పాదక శక్తిని తయారు చేయడంతో పాటు నిల్వచేయవచ్చని అమెరికాలోని కార్నెల్‌ వర్సిటీ పరిశోధకులు  కనుగొన్నారు. వాతావరణంలోని హానికర మూలకాలను ఇది జీవక్రియ కోసం వినియోగించుకుంటుంది. దీని పెరుగుదలకు ఆక్సిజన్‌ అవసరం లేదు. వాతావరణంలోని కార్బన్‌-డైఆక్సైడ్‌ నుంచి కార్బన్‌ అణువులను ‘షెవనెల్లా ఓనెడెన్సిస్‌’ శోషిస్తుంది.

షెవనెల్లా శరీరంలోని చక్కెర అణువులతో కలిసిన ఈ కార్బన్‌.. ఎలక్ట్రాన్లుగా మారి ఒక్కో కణం నుంచి మరో కణానికి ప్రయాణం సాగిస్తాయి. ఈ క్రమంలో శక్తి ఉద్భవిస్తుంది. బ్యాక్టీరియాకు అవసరమైన శక్తి కంటే ఇది ఎక్కువ. నీటిలోని ఈ బ్యాక్టీరియాను బ్యాటరీ ఎలక్ట్రోడ్లకు అనుసంధానిస్తే విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు వివరించారు.

‘షెవనెల్లా ఓనెడెన్సిస్‌’ ఉత్పత్తి చేసే స్వల్ప విద్యుత్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇప్పటికే పలు స్పేస్‌షిప్‌ మిషన్లలో వినియోగించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఉపగ్రహాల బ్యాటరీలు నడిచేందుకు అవసరమైన స్వల్ప విద్యుత్‌ను ఈ బ్యాక్టీరియా సాయంతోనే అందించినట్టు తెలిపింది. రోదసిలో ఆక్సిజన్‌ లేనప్పటికీ, ఈ బ్యాక్టీరియా బతుకుతుంది కాబట్టి, తమ పని ఇంకా సులువైనట్టు పరిశోధకులు వెల్లడించారు.

‘షెవనెల్లా ఓనెడెన్సిస్‌’ నీటిలోని సూక్ష్మ లోహాలను, వ్యర్థాలను కూడా తినేస్తుంది. వ్యర్థ జలాల పునర్వినియోగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ‘షెవనెల్లా ఓనెడెన్సిస్‌’లాగానే ‘జియోబెక్టర్‌ సల్ఫరెడ్యుసెన్స్‌’ బ్యాక్టీరియా కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఆక్సిజన్‌ అవసరం. వాయుకాలుష్యంతో భారతీయుల సగటు ఆయుర్ధాయం 9 ఏళ్లు తగ్గుతోంది.