farmers murder man over robbery doubt: అనుమానం పెను భూతమైంది. అనుమానం ఓ నిండు ప్రాణం తీసింది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఉల్లిగడ్డలు దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో ఓ వ్యక్తిని రైతులు కొట్టి చంపేశారు. కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.
ఆదోని మండలం కపటి నాగాలపురం గ్రామానికి చెందిన నరసన్న కోసిగి మండల కేంద్రంలో జరిగిన సిద్ధరూడ స్వామి జాతరకి వెళ్లాడు. జాతరలో రాత్రి అయ్యేసరికి పడుకొని తెల్లారి వెళ్దామనుకున్నాడు. అదివారం తెల్లవారుజామున లేచి రోడ్డుపై వెళ్తుండగా కాలువ కొంచెం దూరంలో కనిపించడంతో అడ్డదారిలో పొలాల గుండా కాలువ వైపు వెళ్తున్నాడు.
నరసన్నను చూసిన రైతులు దొంగేమోనని అనుమానించారు. తెల్లవారుజామున ఉల్లిగడ్డల దొంగతనం కోసం వచ్చాడనుకుని నరసన్నపై దాడికి దిగారు. కట్టెలతో అతడిని చితకబాదారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనిపై కేసు పోలీసులు ముగ్గురు రైతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానం ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. తెల్లవారుజామున సరిగా వెలుతురు లేని సమయంలో స్నానం చేసేందుకు కాలువ దగ్గరికి వెళ్లడమే నరసన్న పాలిటి మృత్యువైంది.