తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ(జూన్ 23,2020) మధ్యాహ్నం ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాల చెల్లింపుపై సీఎం ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రైతులకు ప్రకటించబోయే కొత్త పథకం, ఆర్థిక సౌలభ్యంపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుతో రూ.2వేల కోట్ల రుణం తీసుకోవడంపైనా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చలు జరపనున్నారు.
3 నెలలుగా జీతాల్లో కోత:
కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోత విధించక తప్పటం లేదని ప్రకటించిన సీఎం కేసీఆర్… మూడు నెలలగా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ లో కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలల నుండి వారికి సగం సాలరీలే ఇస్తున్నారు. దీంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి వారికి పూర్తిగా జీతాలు చెల్లించాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.
లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్ర ఆదాయం ఎలా ఉంది…? ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇస్తే ఎంత భారం పడుతుంది…? రైతులకు మరో గుడ్ న్యూస్ అని ప్రకటించిన అంశంలో ఎన్ని నిధులు అవసరం పడతాయి…? 57 సంవత్సరాలకే పెన్షన్ పథకం అమలు చేయగలమా…? అన్న అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్ష తర్వాత ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపిస్తారని, ఇక నుండి పూర్తిస్థాయి జీతాలు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం.