కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా మూడో విడత లాక్ డౌన్ కొనసాగుతోంది. తొలి విడత లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ హెయిర్ సెలూన్లు మూతపడ్డాయి. అప్పటినుంచి సెలూన్లకు వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకోలేక చాలామంది అలానే ఉంటున్నారు. కొంతమంది సొంతంగా ఇంట్లోనే హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారు. మరికొందరు ఇంటికే ఫోన్ చేసి పిలిపించుకుని మరి కటింగ్ చేయించుకుంటున్న పరిస్థితి.
లాక్ డౌన్కు ముందు హెయిర్ స్టయిల్, బ్యూటీ పార్లర్ అంటూ పరుగులు పెట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థతి లేదు. హెయిర్ కంటింగ్, షేవింగ్ చేయించుకునేందుకు అనుమతి లేదు. కానీ, ఇప్పుడు లాక్ డౌన్ మూడో విడత మొదలైంది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కటింగ్ షాపులు, సెలూన్లకు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు నిత్యావరేతర వస్తువులను విక్రయించవచ్చని కేంద్రం వెల్లడించింది. రెడ్ జోన్లలో కటింగ్ షాపులు, సెలూన్లకు అనుమతి లేదు. అత్యవసరమైన వస్తువుల డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని జోన్లలో పలు షరతులతో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చారు. షాపుల దగ్గర ఐదుగురు కంటే మించి ఉండకూడదు. కస్టమర్లు తప్పనిసరిగా 6 అడుగుల దూరం పాటించాల్సి ఉంటుంది.