MP Simranjit Singh Mann : ఆగస్టు 15న ఇళ్లపై జాతీయ జెండా కాదు..సిక్కుల జెండా ఎగురవేయాలి : ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

‘హర్ ఘర్ తిరంగా’ను బహిష్కరించాలని..ఆగస్టు 15న జాతీయ జెండాకు బదులు సిక్కులకు చెందిన ‘కేసరి’ జెండాలను ఎగురవేయాలని MP సిమ్రన్ జిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పంగా మారాయి.

​‘Hoist Kesari..Not Tiranga on August 15th Day’: 75వ స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ప్రతి ఇంటిమీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హర్ ఘర్ తిరంగా’ను బహిష్కరించాలని..పంజాబ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు..ఆగస్టు 15న జాతీయ జెండాకు బదులు సిక్కులకు చెందిన ‘కేసరి’ జెండాలను ఎగురవేయాలని వ్యాఖ్యలు చేశారు. సిమ్రన్ జిత్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలో పంజాబ్ లో తీవ్ర దుమారం రేపాయి.

వివాదాస్పద ప్రకటనలకు పేరొందిన సిమ్రన్ జిత్ సింగ్ అక్కడితో ఆగలేదు..భారత దళాలను ‘శత్రువు’ శక్తులు అంటూ వ్యాఖ్యానించారు. ఖలిస్థాన్ ఉగ్రవాది అయిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ఆ శత్రు శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందాడని..అన్నారు. మరో వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోలో పంజాబ్ ప్రజలు త్రివర్ణ పతాకాన్ని కాల్చేసి..ఖలిస్థానీ జెండాలను ఎగురవేయాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. పలు పార్టీలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

బీజేపీతో పాటు పంజాబ్ అధికార ఆప్ పార్టీ..ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్, పన్నూన్‌ వ్యాఖ్యలను తీవ్రం ఖండించాయి. ‘హర్ ఘర్ తిరంగా’ బహిష్కరించాలనడం అకాలీదళ్ నిజ స్వభావాన్ని బయటపెడుతుందని ఆప్ అధికార ప్రతినిధి మల్వీందర్ సింగ్ కాంగ్ అన్నారు. ‘స్వాతంత్ర్యం కోసం వేలాది పంజాబీలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. కాబట్టి మాన్ కు ఎవ్వరూ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అంటూ సూచించారు. జాతీయ జెండా పట్ల మాకు అమితమైన గౌరవం ఉంది’ అని స్పష్టంచేశారు ఆప్ నేత మల్విందర్ సింగ్.

పంజాబ్ బీజేపీ నాయకుడు వినీత్ జోషి కూడా గురు పత్వంత్ సింగ్ పన్నూన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఖలిస్థాన్‌ను తిరస్కరించారని..ఎంతో కష్టపడి సంపాదించిన శాంతి విలువను అర్థం చేసుకున్నారని అన్నారు. ‘గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఐఎస్‌ఐ చెప్పినట్టు చేస్తూ దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నో కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న పన్నూన్ ను దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని వినీత్ జోషి డిమాండ్ చేశారు.

కాగా..భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఈ ఆగస్టు 15 జరుపుకుంటోంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తోంది. ఈ మహోత్సవం విదేశీ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకలను సూచిస్తుంది. దీంట్లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు