విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం కోల్పోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2016 అక్టోబరులో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్న టీమిండియా.. ఆ తర్వాత ఇంటా బయటి వరుస విజయాలతో నెం.1 స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లిన భారత్ జట్టు.. టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ అవ్వడంతో కేవలం రెండు పాయింట్ల తేడాతో నెం.1 స్థానాన్ని మిస్ చేసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక భారత్ 114 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమగా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ (105), శ్రీలంక (91), దక్షిణాఫ్రికా (90), పాకిస్థాన్ (86), వెస్టిండీస్ (79), అఫ్గానిస్థాన్ (59), బంగ్లాదేశ్ (55) టాప్-10లో నిలిచాయి.
నాలుగేళ్ళలో తొలిసారిగా కోహ్లీసేన నంబర్వన్ ర్యాంకును చేజార్చుకుంది. అక్టోబర్ 2016 నుంచి టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తుండగా.. తాజాగా ప్రకటించిన పురుషుల క్రికెట్ టీమ్ ర్యాంకింగ్స్లో తన ఫస్ట్ ర్యాంకును కోల్పోయింది టీమిండియా. 2019 మే నుంచి ఆడిన అన్ని మ్యాచ్లను 100 శాతంగా, అంతకుముందు రెండేళ్ల మ్యాచ్లను 50 శాతంగా పరిగణనలోకి తీసుకొని పాయింట్లను కేటాయించింది ఐసీసీ.
మెరుగైన పాయింట్లను సాధించడం ద్వారా ఐసీసీ పురుషుల టెస్ట్ టీం ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా(26 మ్యాచ్లు) 116 పాయింట్లతో నంబర్వన్ ర్యాంకుకు ఎగబాకింది. ఇక టీ20ల్లోనూ కంగారులదే హవా.. టీ20 ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియాదే అగ్రస్థానం. రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఇంగ్లాండ్, భారత్ నిలిచాయి. పాకిస్థాన్ నాలుగు, సౌతాఫ్రికా ఐదో ర్యాంకు సాధించాయి.(ధోనీలా కీపింగ్ చేయాలంటే భయం వేస్తుంది: కేఎల్ రాహుల్)