Passport Fingerprints : వేలిముద్రల సేకరణతో పాస్ పోర్టుల జారీ
నేరస్తులు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకే ఈ తరహా కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.
- Guntupalli Ramakrishna
- Published On : July 12, 2021 / 02:19 PM IST
వేలిముద్రలతో పాస్ పోర్టు జారీ
Passport Fingerprints : క్రిమినల్ కేసులు ఉన్న వారు ఇకపై పాస్ పోర్టు పొందటం కష్టతమరమే.. ఎందుకంటే కేంద్రప్రభుత్వం పాస్ పోర్టుల జారీ విషయంలో కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం పాస్ పోర్టుకోసం ధరఖాస్తు చేసుకునే వారు తమ వేలిముద్రలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వేలిముద్రల ద్వారానే పాస్ పోర్టు ఇవ్వాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు పాస్ పోర్టు అధికారులు. నేరస్తులు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకే ఈ తరహా కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.
ఇప్పటి వరకు పాస్ పోర్ట్ జారీ చేసేందుకు పెద్ద తతంగమే చేయాల్సి వచ్చేది. పాస్ పోర్టుకు ధరఖాస్తు చేసుకున్న అనంతరం దానిని ఆయా ప్రాంతాల్లోని స్పెషల్ బ్రాంచి పోలీసు అధికారులు ధరఖాస్తు దారుని పూర్తి సమాచారాన్ని, అతనిపై ఉన్న కేసులు ఇతర వివరాలన్నింటిని సేకరించేవారు. ఇందుకోసం ఎక్కవ రోజులు పట్టేది. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న వేలిముద్రల సేకరణ టెక్నాలజీతో 2నుండి 4రోజుల వ్యవధిలోనే పోలీస్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
విదేశాలకు పారిపోవాలనుకునే నేరగాళ్ళకు ఈ ప్రక్రియతో అడ్డుపడనుంది. అటు అధికారులు సైతం వేలిముద్రల సేకరణ ద్వారా పాస్ పోర్టు జారీ మంచిపద్దతని అంటున్నారు. పాపిలోన్ టెక్నాలజీ ద్వారా ధరఖాస్తు దారుల వేలిముద్రలను గంటల వ్యవధిలోనే విశ్లేషించవచ్చు. ఇప్పటికే చాలా మంది నేరస్తుల వేలిముద్రల డేటా పోలీసుల వద్ద అందుబాటులో ఉంది. ధరఖాస్తు దారుడు వేలిముద్రల సమాచారంపై ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైతే పాస్ పోర్టు జారీ నిలిచిపోతుంది. ఒకవేళ దీనిపై అభ్యంతరం ఉన్నట్లైతే న్యాయస్ధానం ద్వారా ప్ర్యతేక అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది.
