famous Temples : ఆ దేవాలయాలను దర్శంచుకోవటం అంత సులభం కాదు..

దేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్, బద్రీనాథ్ మాత్రమే కాదు...దర్శించుకోవడానికి కష్టతరమైన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అక్కడ కొలువై ఉన్న భగవంతుడి దర్శనం అంత సులభతరమేమీ కాదు. ఆ దేవుళ్ల దర్శనభాగ్యం దొరకాలంటే.. భక్తి ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు. కష్టపడే శక్తి కూడా ఉండాలి. అనేక సహజ, వాతావరణ అడ్డంకులను దాటుకొని వెళ్లే సంకల్ప బలాన్ని కలిగి ఉండాలి.

  • Published On : October 21, 2022 / 12:07 PM IST

It is very difficult to visit these temples in Uttarakhand

famous Temples in Uttarakhand : కేదార్‌నాథ్, బద్రీనాథ్ మాత్రమే కాదు. ఉత్తరాఖండ్‌లో దర్శించుకోవడానికి కష్టతరమైన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అక్కడ కొలువై ఉన్న భగవంతుడి దర్శనం అంత సులభతరమేమీ కాదు. ఆ దేవుళ్ల దర్శనభాగ్యం దొరకాలంటే.. భక్తి ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు. కష్టపడే శక్తి కూడా ఉండాలి. అనేక సహజ, వాతావరణ అడ్డంకులను దాటుకొని వెళ్లే సంకల్ప బలాన్ని కలిగి ఉండాలి.

శంకరుడు కొలువైన పవిత్ర స్థలం..
ఒక భక్తుడు గనక.. తాను నమ్మిన దైవాన్ని దర్శించుకొని తీరాలని నిర్ణయించుకుంటే.. అతన్ని ఏదీ ఆపలేదు. అయితే.. దేవభూమి ఉత్తరాఖండ్‌లో కొలువై ఉన్న కొన్ని ఆలయాలను దర్శించుకోవడం అంత సులువు కాదు. ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయ్. మరెన్నో ఇబ్బందులు వెంటాడుతాయ్. వీటన్నింటిని అధిగమించేందుకు.. తీవ్రమైన సంకల్ప శక్తి అవసరమవుతుంది. అప్పుడే.. భక్తులు తాము నమ్మిన దైవాన్ని కనులారా దర్శించుకునేందుకు వీలవుతుంది. అలాంటి దర్శనీయ స్థలాల లిస్టులో.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ మాత్రమే కాదు.. మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో.. కైలాస మానస సరోవర్ ఒకటి. ఇది.. నిజంగా అత్యంత సవాల్‌తో కూడుకున్న ప్రదేశం. దీనిని చేరుకోవడం ఎంతో కష్టమైన వ్యవహారం. ప్రస్తుతం.. ఇది చైనా ఆక్రమిత టిబెట్‌లో కొలువై ఉంది. ఈ ప్రదేశంలో కైలాస పర్వతంతో పాటు మానస సరోవర్ సరస్సు.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయ్. ఇక్కడ.. ఆ శివుడే కొలువై ఉంటాడని భక్తులు నమ్ముతుంటారు.

2 వందల ఏళ్ల చరిత్ర రుద్రప్రయాగ జిల్లాలో.. కార్తీక స్వామి ఆలయం..
ఇక.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో.. కార్తీక స్వామి ఆలయం కొలువై ఉంది. 2 వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ పురాతన కోవెల ఇది. ఉత్తరాఖండ్ మొత్తంలో.. కొలువై ఉన్న ఏకైక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. 3050 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే.. సాహసం చేయాల్సిందే. ఇక్కడికి చేరుకునేందుకు.. భక్తులు కనకచౌరి గ్రామం నుంచి 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టతరమైన వ్యవహారం.

యుమునోత్రి ఆలయం..
ఉత్తరాఖండ్‌ చోటా చార్‌ధామ్ యాత్రకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో.. యుమునోత్రి ఆలయం ఒకటి. ఈ సుందరమైన ఆలయం.. ఉత్తరకాశీ జిల్లాలో కొలువై ఉంది. ఈ టెంపుల్.. 3 వేల 293 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే.. బలమైన మానసిక, శారీరక బలం అవసరం.

పర్వత క్షేత్రం తుంగనాథ్ ఆలయం..
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న మరో పర్వత క్షేత్రం తుంగనాథ్ ఆలయం. ఈ క్షేత్రానికి.. ఓ విశేషం ఉంది. ప్రపంచంలోనే.. ఎత్తైన శివాలయం ఈ తుంగనాథ్ క్షేత్రం. ఇది.. హిమాలయాల్లో.. 3 వేల 680 మీటర్ల ఎత్తులో కొలువై ఉంది. సుమారు వెయ్యేళ్ల క్రితం.. ఈ దివ్య ఆలయాన్ని నిర్మించి ఉంటారని భక్తులు నమ్ముతారు.

సాహసయాత్ర అమర్‌నాథ్..
ఇక.. 3 వేల 888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని చేరుకోవడమంటే.. అదో సాహసయాత్ర. ఈ గుహకు సంబంధించి అనేక రహస్యాలు దాగున్నాయ్. అదే.. అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకొని తీరాలన్న ఆసక్తి భక్తుల్లో కలిగేలా చేస్తోంది. అయితే.. ఆలయాన్ని చేరుకునే ట్రెక్కింగ్ మార్గం సవాల్‌తో కూడుకున్నది. కానీ.. ఆ హిమాలయాల్లోని ఆ గుహలో కొలువై ఉండే మంచు శివలింగం దర్శనం తర్వాత.. అక్కడి వాతావరణంలో.. ఆ అలసట మొత్తం మాయమైపోతుంది. అయితే.. అమర్‌నాథ్ ఆలయాన్ని చేరుకోవాలంటే.. బలమైన మానసిక, శారీరక బలం అవసరం.

పరస్నాథ్ కొండపై.. 1350 మీటర్ల ఎత్తులో కొలువైన శిఖర్ జీ ఆలయం
జార్ఖండ్‌లో.. జైనులకు అత్యంత దివ్యక్షేత్రమైన శిఖర్ జీ ఆలయం కొలువై ఉంది. పరస్నాథ్ కొండపై.. 1350 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంది. మొత్తం 24 మంది జైన తీర్థంకరులలో.. 20 మంది మోక్షం పొందిన ప్రదేశం ఇదేనని చెబుతుంటారు. అందువల్ల.. ఈ ఆలయం జైన మతంలో ఎంతో ప్రాముఖ్యతను, విశిష్టతను కలిగి ఉంది. ఈ శిఖర్ జీ ఆలయాన్ని.. తీర్థరాజ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే.. మధుబన్ నుంచి 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ మార్గం కూడా నిటారుగా ఉన్నట్లుంటుంది. కాబట్టి.. ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉంటేనే.. శిఖర్ జీని దర్శించుకోగలం.

లద్దాఖ్‌లో.. 3 వేల 850 మీటర్ల ఎత్తులో.. ప్రపంచంలోనే అత్యంత మఠాల్లో ఒకటి ఫుగ్తాల్ మఠం
లద్దాఖ్‌లో.. 3 వేల 850 మీటర్ల ఎత్తులో.. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన మఠాల్లో ఒకటిగా చెప్పబడుతున్న ఫుగ్తాల్ మఠం కొలువై ఉంది. ఓ కొండ మధ్యలో కొలువై ఉండటమే.. దీని ప్రత్యేకత. లద్దాఖ్‌లోని జన్స్కర్ ప్రాంతంలోని పడుమ్ సమీపంలో ఇది ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే.. పడుమ్-మనాలి ట్రెక్కింగ్ రూట్ నుంచి 7 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.ఈ ఆలయాలన్నింటిని దర్శించుకోవాలంటే.. మానసిక స్థైర్యంతో పాటు ఆరోగ్యం కూడా సహకరించాల్సి ఉంటుంది. వీటి కారణంగానే.. ఈ ప్రాంతాల్లో మతపరమైన టూరిజం కాస్త తక్కువగా ఉందనే అభిప్రాయాలున్నాయి. తాజాగా.. కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో మాదిరిగానే.. ఈ ఆలయాల దగ్గర కూడా కనెక్టివిటీని పెంచగలిగితే.. ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుంది.