Jogulamba Gadwal: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. పరిహారంగా ఎకరం భూమి!
కాలం మారినా పల్లెల్లో అనాదిగా వస్తున్న వింత సంస్కృతి మారడం లేదు. చట్టాలు, శిక్షలు ఎన్ని చేసినా దేశంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. పసి పిల్లల నుండి వయసు మళ్ళిన వృద్ధులపై వరకు మృగాళ్ల పైశాచికంలో మార్పు రావడం లేదు.
- Naresh Mannam
- Published On : April 30, 2021 / 12:51 PM IST
Jogulamba Gadwal
Jogulamba Gadwal: కాలం మారినా పల్లెల్లో అనాదిగా వస్తున్న వింత సంస్కృతి మారడం లేదు. చట్టాలు, శిక్షలు ఎన్ని చేసినా దేశంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. పసి పిల్లల నుండి వయసు మళ్ళిన వృద్ధులపై వరకు మృగాళ్ల పైశాచికంలో మార్పు రావడం లేదు. బయటకి చెప్తే పరువు పోతుందనో.. బెదిరింపులు, చట్టాలు, శిక్షల మీద నమ్మకం లేకనో ఇప్పటికీ ఎన్నో పైశాచిక చర్యలు బయటకు రాకపోగా కొందరు మాత్రం బయటపడి తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టి న్యాయం కోసం పోరాడుతున్నారు. అయితే.. ఇప్పటికీ కొన్ని మారుమూల పల్లెల్లో పంచాయతీ పెద్దలు స్త్రీ మానానికి కూడా విలువగడుతున్నారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్ మండలంలో తొమ్మిది సంవత్సరాల బాలికపై ఓ మృగం అత్యాచారం చేయగా పంచాయతీ పెద్దలు ఎకరం భూమి పరిహారం ఇచ్చి నేరాన్ని మాఫీ చేయాలనుకున్నారు. అయితే.. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి విలువ కట్టడం సహించలేని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా సమీపంలోనే నివాసముండే 35 ఏళ్ల ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
ఇంటి బయటే ఆడుకుంటున్న బాలిక కనిపించకపోవడంతో వెతికిన బాలిక తల్లిదండ్రులు జరిగిన దారుణాన్ని తెలుసుకొని నిందితుని పట్టుకున్నారు. విషయం గ్రామంలోని పంచాయితీ పెద్దలకు తెలియడంతో పంచాయితీ నిర్వహించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. జరిగిన అత్యాచారానికి పరిహారంగా భాదితురాలి కుటుంబానికి ఎకరం భూమి ఇప్పిస్తామని తీర్పు చెప్పారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి పంచాయతీ పెద్దల తీర్పుకు ఒప్పుకొని తల్లిదండ్రులు స్థానిక ఆలంపూర్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
