BJP MLA Attacked By Villagers : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేను దుస్తులు చినిగిపోయేలా కొట్టిన గ్రామస్తులు
కర్నాటకలోని చిక్కమగళూరులో బీజేపీ ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే దుస్తులు చినిగిపోయాయి.
- nagamani
- Published On : November 21, 2022 / 12:08 PM IST
BJP MLA Attacked By Villagers In Chikkamagaluru
BJP MLA Attacked By Villagers In Chikkamagaluru : కర్నాటకలోని చిక్కమగళూరులో బీజేపీ ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే దుస్తులు చినిగిపోయాయి. ఏనుగు దాడిలో చనిపోయిన మహిళ మృతదేహంతో గ్రామస్థుల నిరసన చేపట్టారు. ఈక్రమంలో గ్రామస్తులను పరామర్శించేందుకు బీజేపీ ఎమ్మెల్యే వచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఏనుగు దాడిలో జనం ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆగ్రహించారు.. మృతదేహంతో ఆందోళన చేస్తున్న గ్రామస్తులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే కుమారస్వామి రాగా..ఇప్పుడా వచ్చేది అంటూ మండిపడ్డ జనం.. సదరు ఎమ్మెల్యేను తరిమి కొట్టారు. పోలీసులు కల్పించుకుని అతికష్టమ్మీద ఎమ్మెల్యేను స్థానికుల బారి నుంచి కాపాడారు.
చిక్కమగళూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇటీవల ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. తరచుగా ఏనగుల బారిన పడి జనం చనిపోతున్నరు. ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలంటూ గ్రామస్థులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఆదివారం (నవంబర్ 20,2022) హుల్లేమేన్ గ్రామానికి చెందిన ఓ మహిళపై ఏనుగు దాడి చేసి చంపేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మృతదేహంతో ఆందోళనకు దిగారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎంపీ కుమార స్వామి గ్రామానికి వచ్చారు. అయితే, జనం చనిపోతున్నా పట్టించుకోరా..? మృతదేహంతో తాము ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే..తీరుబాటుగా ఏమీ పట్టనట్లుగా సాయంత్రానికి వస్తారా అని జనం ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా సమాధానం ఇచ్చారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన స్థానికులు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊళ్లో నుంచి తరిమి కొట్టారు. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు అతికష్టమ్మీద ఎమ్మెల్యేను కాపాడి.. అక్కడి నుంచి వాహనంలో తరలించారు.
