Mansadevi Temple : బిల్వపర్వత శిఖరంపై కొలువైన మానసాదేవి
హిమాలయాలకు దక్షిణ భాగంలో శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వతంపై మానసాదేవి కొలువై ఉంది.
- Guntupalli Ramakrishna
- Published On : July 23, 2021 / 07:06 PM IST
Manasa Devi
Mansadevi Temple : ఉత్తారాఖండ్ లోని హరిద్వార్ సమీపంలోని మానసాదేవి ఆలయం ప్రాచీన దేవాలయలలో ఒకటి. హరిద్వార్ వెళ్ళే భక్తులు తప్పనిసరిగా మానసా దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. హరిద్వార్ లో ఉన్న మూడు శక్తి పీఠాలలో మానసదేవి ఆలయం కూడా ఉంది. కోరిన కోర్కెలు తీర్చే దేవతగా భక్తులు మానసా దేవిని కొలుస్తారు. అదిష్టాన దేవతగా, శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటుంది.
హిమాలయాలకు దక్షిణ భాగంలో శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వతంపై మానసాదేవి కొలువై ఉంది. హరిద్వార్ ప్రాంతంలో ఉన్న అధ్యాత్మిక ఆలయాల్లో విశిష్టమైన ఆలయంగా మానస దేవి ఆలయాన్ని చెప్పవచ్చు. మానస అనగా కోర్కెలు నెరవేర్చే దేవత అని అర్ధం. ఈ దేవాలయంలోని వృక్షాలకు దారాలను కట్టి తమ కోర్కెలు నెరవేర్చమని భక్తులు మానసా దేవిని వేడుకుంటారు. కోరుకున్న కోర్కెలు నెరవేరిన భక్తులు తిరిగి ఆలయ సందర్శన చేసి చెట్టుకొమ్మలకు దారాలు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు.
పార్వతీ దేవి రూపాలైన మానస, చండీ ఇద్దరూ ఎల్లప్పుడూ కలసి ఉండేవారని భక్తులు విశ్వసిస్తుంటారు. ఎత్తైన శిఖరంపై ఉన్న ఈ ఆలయానికి వెళ్ళాలంటే మెట్ల మార్గంతో పాటు రోప్ వే కూడా భక్తులకు అందుబాటులో ఉంది. ఈ దేవాలయం శిఖర భాగం నుండి చూస్తే కనుచూపులో గంగానది, హరిద్వార్ లు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు తెరిచి ఉంచుతారు.
