Etela Rajender : వారికి గన్ లైసెన్సులు ఇచ్చారు .. నాకు, నా కుటుంబానికి ఏమన్నా జరిగితే కేసీఆర్దే బాధ్యత
హుజూరాబాద్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇచ్చారని..తనకు తన కుటుంబానికి ఏమన్నా జరిగితే సీఎం కేసీఆర్ దే బాధ్యత వహించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- nagamani
- Published On : September 14, 2022 / 03:46 PM IST
Etela Rajender
Etela Rajender : ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈటలపై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. ఈటల స్పీకర్ ను మరమనిషి అనే వ్యాఖ్యలపై సస్పెండ్ కు గురయ్యారు. ఈ క్రమంలో మరోసారి ఈటల టీఆర్ఎస్ పైనా..సీఎం కేసీఆర్ పైనా విమర్శలు సంధించారు. పలు ఆరోపణలు చేశారు.హుజూరాబాద్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇచ్చారని..తనకు తన కుటుంబానికి ఏమన్నా జరిగితే సీఎం కేసీఆర్ దే బాధ్యత వహించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ను గద్దె దించేవరకు నిద్రపోనని ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు కేసీఆర్ తో ఉన్నారంటే అది వారి వారి అవసరాల కోసమే తప్ప టీఆర్ఎస్ పార్టీమీద..కేసీఆర్ పై ఉన్న నమ్మకంతో కాదన్నారు ఈటల. త్వరలోనే టీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతానని అన్నారు.బీజేపీకీ టీఆర్ఎస్ నేతలు క్యూ కడతారని అవన్నీ కేసీఆర్ చూసి తీరుతారని ధీమా వ్యక్తంచేశారు. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపైనా..ఆమె భాషపైనా స్పీకర్ కు ఫిర్యాదు చేయటం అనేది ఓ దిక్కుమాలిన చర్య అంటూ ఈటల ఎద్దేవా చేశారు.
కాగా..వైఎస్ షర్మిల మాట్లాడుతూ..టీఆర్ఎస్ నేతలకు తనను ఎదుర్కొనే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె 10 టీవీతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. వైఎస్ షర్మిల తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పీకర్ పోచారం శ్రీనివాస్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై టీఆర్ఎస్ నేతలు చిన్నపిల్లల్లా స్పీకర్కు ఫిర్యాదు చేశారని షర్మిల విమర్శించారు. ‘‘ఎవరికి ఫిర్యాదు చేసినా భయపడేది లేదు. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆ స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. టీఆర్ఎస్ నేతలకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు’’ అని షర్మిల అన్నారు.
