Ongole Highway Killer: హైవే కిల్లర్ మున్నా కేసు.. 12 మందికి ఉరిశిక్ష!
హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 12 మందికి కోర్టు మరణిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రధాన ముద్దాయి మహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతో పాటు ముఠాలోని మిగతా 11 మందికి కోర్టు మరణశిక్ష విధించింది.
- Naresh Mannam
- Published On : May 24, 2021 / 03:05 PM IST
Ongole Highway Killer Highway Killer Case 12 Hanged
Ongole Highway Killer: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 12 మందికి కోర్టు మరణిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రధాన ముద్దాయి మహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతో పాటు ముఠాలోని మిగతా 11 మందికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసులో మొత్తం 19 మందికి శిక్ష పడింది. దీంతో ఇప్పుడు ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
జాతీయ రహదారులపై వెళుతున్న లారీలను అటకాయించి డ్రైవర్లను కిరాతకంగా చంపడం మున్నా గ్యాంగ్ పని. అలా మున్నా గ్యాంగ్ 13 ఏళ్ల క్రితం ఏడుగురు లారీ డ్రైవర్లను, క్లీనర్లను హత్య చేసింది. మున్నా 13 హత్య కేసుల్లో నిందితుడు కాగా నాలుగు కేసుల్లో నేరం రుజువైందని ఒంగోలు కోర్టు స్పష్టం చేసింది. లారీ డ్రైవర్లను, క్లీనర్లను దారుణంగా హత్య చేసి గోతాల్లో కుక్కి వాగుల వద్ద పూడ్చిపెట్టిన ఘటన అప్పట్లో పెను సంచలనంగా మారగా ఇప్పటికీ ఎన్నో డ్రైవర్ల మిస్సింగ్ కేసులు మిస్టరీగానే ఉన్నాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఇస్లామ పేటలో మున్నా నివాసం ఏర్పరుచుకోగా ఇతనికి భార్యతో పాటు ముగ్గురు సంతానం. 2012 అక్టోబర్లో ఒంగోలు సబ్ జైలు నుంచి బెయిల్పై విడుదలై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతకాలం జీవనం సాగించాడు. హైదరాబాద్, బెంగుళూరు, వైజాగ్, ఒంగోలులో వ్యాపారాల పేరుతో ప్రజలను భారీ ఎత్తున మోసం చేసి అక్కడి నుంచి మకాం మార్చాడు. పలు కిడ్నాప్ కేసులు.. చోరీ కేసులు కూడా మున్నాపై ఉండగా హైవేలపై లారీలను ఆపి డ్రైవర్లను, క్లీనర్లను అంతమొందించడం ఈ గ్యాంగ్ అసలు వృత్తి. పోలీసుల ఫిర్యాదుతో కర్ణాటకలోని మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్ లో అరెస్టు చేసి ఒంగోలుకు తరలించగా నేడు ఈ కేసులో శిక్ష పడింది.
