Pm Modi
PM Modi: జమ్మూకశ్మీర్ భవిష్యత్పై కొద్దికాలంగా కేంద్రం వద్ద సమాలోచనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఇదే అంశంపై సమావేశాలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మరోసారి కశ్మీర్కు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభం కానున్న ఈ సమావేశానికి కశ్మీర్కు చెందిన వివిధ పార్టీ నాయకులు 14 మంది పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరవడానికి ఒక్కొక్కరుగా నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలుండగా.. బీజేపీ.. మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో సంబంధాలు తెంచుకున్న తరువాత పాలక సంకీర్ణం కుప్పకూలినప్పటి నుండి 2018 నుండి రాష్ట్రపతి పాలనలో జమ్మూ కాశ్మీర్లో రాజకీయ ప్రక్రియను ప్రారంభించే ప్రశ్నపై కేంద్రం చర్చించనుంది. ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా బుధవారం పార్టీ నేతలతో ఈ సమావేశంపై చర్చించగా.. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇలాంటి సమావేశాలు జరగడం మంచిదేనని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా ఈ ప్రాంత ఐక్యత, సమగ్రత కాపాడేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సమావేశానంతరం నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ ప్రాంత అధ్యక్షుడు దేవందర్ రాణా చెప్పారు. పీడీపీ చీఫ్ మెహబూబా కశ్మీర్కు తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టాలని సమావేశంలో గట్టిగా డిమాండ్ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. కశ్మీర్కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తిరిగి కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది.