వ్యవసాయ చట్టాల మార్పులకు సిద్ధంగా ఉన్నాం..రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మోడీ

Modi Ready to change the laws of agriculture : కేంద్ర ప్ర‌భుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని..వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నామని అయినా రైతులు ఆందోళన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రధాని మోడీ. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో రాజ్యసభలో ప్రధాని మోడీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..రైతులతో పలుమార్లు చర్చలు జరిపామని తెలిపారు. తమ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామ‌ని..దశాబ్దాలుగా వ్య‌వ‌సాయ రంగంలో సంస్క‌ర‌ణ‌లు నిలిచిపోయాయ‌ని ఈ సందర్భంగా మోడీ అన్నారు.

స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని..అంతేతప్ప ఆందోళనతో రైతులు సమయం వృథా చేసుకోవద్దని ప్రధాని రైతులకు సూచించారు. రైతుల‌తో చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం ఇప్పటికీ సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. రైతుల అభ్యంత‌రాల ప‌రిశీలన‌కు కేంద్ర స‌ర్కారు సిద్ధంగా ఉంద‌ని మోదీ చెప్పారు. రైతులు పండించిన పంటల విషయంలో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌లో ఎటువంటి మార్పులూ ఉండ‌బోవ‌ని స్పష్టంచేశారు. రైతుల‌కు ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్చ‌ల్లో వారు సూచ‌న‌లు చేశార‌ని తెలిపారు. వాటిని ప‌రిష్క‌రించేందుకు తాము సానుకూలంగా ఉన్నామ‌ని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు రైతుల్ని రెచ్చగొడుతున్నాయని..రైతుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీరు సరైంది కాదన్నారు.

వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని డిమాండ్ చేసేవారు ఆ చట్టాల్లో ఎటువంటి తప్పులున్నాయో..వాటి వల్ల రైతులకు ఎటువంటి నష్టాలు కలుగుతాయో తెలపాలని అన్నారు. రైతు మేలు కోసమో కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చాం తప్ప రైతుకు నష్టం చేయటానికి కాదని ఈ విషయం రైతులు గుర్తించాలని వాటి గురించి తెలుసుకోవాలని ప్రధాని సూచించారు.

అలాగే కరోనా గురించి మోడీ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ పోరాటంలో భారత్‌ ప్రదర్శించిన స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడాయాడారు. కోవిడ్‌ విపత్తును భారత్‌ ఎదుర్కున్న తీరు ప్రసంశనీయమని, ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని అన్నారు. దేశం మరింత బలపడటానికి కరోనా వైరస్‌ బాటలువేసిందన్నారు. లాక్‌డౌన్‌సమయంలో కరోనా వారియర్స్‌ చేసిన సేవ వర్ణించలేనిదని వారి సేవలను కొనియాడారు.

ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపడుతోందనీ..వ్యాక్సినేషన్‌ ప్రక్రియనలో భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. కోవిడ్‌ సంక్షోభాన్ని భారత్‌ సమర్థవంతగా ఎదుర్కొందని, కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ టీకా అభివృద్ధిలో మనదేశ శాస్త్రవేత్తలు పోషించిన పాత్ర వర్ణించలేనిదని కొనియాడారు.

అనేక దేశాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ భారత్‌లో కొనసాగుతోంది.. మన బలమేంటో ప్రపంచానికి అర్థమైంది. నూతన అవకాశాల నిలయంగా భారత్‌ మారుతోంది. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. అనేక అవకాశాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతున్నాం. సంక్షోభం కారణంగా భారత్‌ మరింత బలపడింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ వైపు అడుగులు పడేలా చేసింది. కరోనాపై విజయం ప్రభుత్వానిది కాదు.. ప్రజలందరిది. మానవాళి రక్షణకు భారత్‌ కృషిని ప్రపంచమంతా ప్రశంసిస్తోంది’ అని అన్నారు.

కాగా..రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకం అని ప్రశంసిచారు. సభ్యులంతా అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షం బహిష్కరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రైతు దీక్షలను ప్రస్తావించారు. కేంద్రం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం పార్లమెంట్‌ వేదికగా మరోసారి స్పష్టం చేశారు.