మార్చి 7 లోగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు : మోడీ
- venkaiahnaidu
- Published On : February 23, 2021 / 10:05 PM IST
అసోం,కేరళ,పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్చి 7లోగా ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మార్చి మొదటివారంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి కూడా తేదీని ఈసీ ప్రకటించవచ్చునన్నారు.
అసోంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో ఆయన ఈ మేరకు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరుగునున్న అసోంలో నెల రోజుల వ్యవధిలో మోదీ ఇక్కడ పర్యటించడం ఇది మూడోసారి కావడం విశేషం. 2016 ఎన్నికలు కూడా ఇదే మాదిరిగా మార్చి 4 న ప్రకటించారని, ఈ ఏడాది బహుశా మార్చి 7 నాటికి ఈసీ తేదీలను ప్రకటించవచ్చునని తాను భావిస్తున్నానని మోడీ చెప్పారు.
మరోవైపు, పశ్చిమ బెంగాల్లో బీజేపీ చేపడుతున్న పరివర్తన్ యాత్రలకు ముగింపుగా కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో వచ్చె నెల తొలి వారంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభలో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. మరుసటిరోజున ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో బీజేపీ 5 పరివర్తన్ యాత్రలు నిర్వహించింది. ఆరో యాత్ర వచ్ఛే నెల జరగవచ్చునని అంటున్నారు.
