Poisonous Snakes : ప్రాణాలు తీస్తున్న విషసర్పాలు… భయంతో వణికిపోతున్న జనం…ఎక్కడంటే..
ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో పాము కాటు మరణాలు వెలగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
- Guntupalli Ramakrishna
- Published On : July 26, 2021 / 03:52 PM IST
Snake (1)
Poisonous Snakes : పాముల భయంతో ఉత్తర ప్రదేశ్ వాసులు వణికిపోతున్నారు. పాముకాటుకు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా యూపీలోని బలియా జిల్లాలో చోటు చేసుకున్న పలు పాము కాటు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఓ చిన్నారితోపాటు మిగిలిన వారంతా 30 ఏళ్ళలోపు ఉన్న యువకులే..విషసర్పాల కారణంగా వరుసవెంట మృతి సంఘటనలు ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కవగా ఈఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వర్షాకాలం కావటంతో పాములు బయటకు రావటం, వివిధ పనుల నిమిత్తం వెళుతున్నవారిని పాములు కరవటం తో ప్రమాదకరంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటంతో దూర ప్రాంతానికి వైద్యం కోసం బాధితులను తీసుకువెళ్ళే లోపు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో పాము కాటు మరణాలు వెలగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. స్ధానికంగా ఉండే ఆసుపత్రుల్లో యాంటీ వీనమ్ లేకపోవటం కూడా మరణాలకు కారణంగా చెబుతున్నారు. ఇది ఇలావుంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 1,38వేల మంది ప్రాణాలు కోల్పోతుండగా వారిలో సగం మంది భారతదేశానికి చెందిన వారే పాముకాటుకు బలైపోతున్నారు.
ప్రస్తుతం యూపీలోని మారుమూల ప్రాంతాల వాసులు వరుస పాము కాటు ఘటనలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతుంటే పాముకాటు మరణాలు వారిని మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధమిక కేంద్రాల్లో తక్షణమే పాముకాటు చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని అదేశాలిచ్చింది.
