Prashant Kishor on bihar cm promises: బిహార్ లో ఏర్పడిన మహాఘట్బంధన్ ప్రభుత్వం రెండు ఏళ్ళలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తాను చేపిట్టిన ‘జన సూరజ్ అభియాన్’ను ఆపేసి, సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇటీవల బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ చెప్పారు. సీఎం నితీశ్ కుమార్ కూడా ఇదే అంశంపై హామీ ఇచ్చారు. ప్రశాంత్ కిశోర్ దీనిపై స్పందించారు. అన్ని ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఎక్కడుందని నిలదీశారు. బిహార్ లోని ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మద్దతును పొందలేదని చెప్పారు.
నితీశ్ కుమార్ సీఎం పదవిని ఫెవికాల్తో అంటించుకుని ఉన్నారని, దాని చుట్టూ ఇతర పార్టీలన్నీ తిరుగుతున్నాయని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. తాను బిహార్ రాజకీయ రంగంలోకి ప్రవేశించి మూడు నెలలే అవుతోందని, రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో బిహార్ రాజకీయాల్లో మరిన్ని తిరుగుబాట్లు చోటుచేసుకుంటాయని అన్నారు. కాగా, బిహార్ లో అన్ని ప్రాంతాల వారితో కలిసి పనిచేసేందుకుగాను తాను ‘జన సూరజ్ అభియాన్’ పేరుతో పర్యటిస్తానని, ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యల గురించి తెలుసుకుంటానని ప్రశాంత్ కిశోర్ కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
Kabul mosque attack: అఫ్గాన్లో బాంబు పేలుళ్ళు.. 20 మంది మృతి.. 40 మందికి గాయాలు