Priyanka Chopra Says Film Industry Was Monopolised By Specific People
Priyanka Chopra: సినీ ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే నలిగిపోతుందని మనం తరచుగా వింటూ ఉంటాం. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో నేపాటిజంపై తీవ్ర విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి చాలా మంది సెలబ్రిటీలు ఈ నేపాటిజంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు హవా చాటుతూ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంకాచోప్రా కూడా ఇప్పుడు ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే ఉందన్నది నిజమేనని తేల్చి చెప్పింది.
పీసీ నటించిన ది వైట్ టైగర్ సినిమా ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక.. బాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా గుత్తాధిపత్యం కొనసాగుతుందని.. ఇప్పుడు దానిని బ్రేక్ చేస్తూ ఓటీటీ కొత్త అవకాశాలను అందిస్తుందని.. అందుకే కొత్త కథాంశాలు వస్తున్నాయన్నారు. మొన్నటి వరకు సినిమా అంటే నాలుగు పాటలు, రెండు ఫైట్స్ అనే ధోరణి నుండి కథల ఆధిపత్యం మొదలైందని దీనికి కారణం ఓటీటీల ద్వారా ప్రేక్షకులు నచ్చిన కథలను పట్టం కట్టడమేనని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ప్రేక్షకులను అక్షర్శించిన స్ట్రీమింగ్ సేవలు నటీనటులను బాలీవుడ్ సినీ పరిశ్రమలో నిబంధనల గురించి ఆలోచించేలా చేశాయన్న పీసీ.. కొత్త రచయితలు, నటీనటులు, చిత్రనిర్మాతలకు బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి రావడానికి ఓటీటీ సంస్థలు అవకాశాలు కల్పించాయని చెప్పారు. అయితే థియేటర్లలో సినిమా చూసిన ఫీల్ ఎప్పటికీ రాదని.. ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులకు థియేటర్ అనుభూతిని కలిగిస్తున్నాయన్నారు. సినిమాను ఓటీటీ ప్రజలకు మరింత దగ్గర చేయడమే కాకుండా.. మూసధోరణిలో చేతికి చిక్కిన ఆధిపత్యాన్ని అధిగమించి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పింది. అయితే.. అసలే బాలీవుడ్ లో కొందరు రాజుమేలుతున్నారనే విమర్శలకు తోడు పీసీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చగా మారింది.