ఆర్థిక సంక్షోభానికి.. నగదు ముద్రణే పరిష్కారం!

  • Publish Date - May 15, 2020 / 01:43 AM IST

దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దాదాపు రూ.7 లక్షల కోట్ల నగదును ముద్రించే అవకాశం ఉందని సమాచారం. కొవిడ్‌-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. నిధుల్లో రూ.6.8 లక్షల కోట్లను నగదు ముద్రణ ద్వారా సమకూర్చాల్సిందిగా కేంద్రం ఆర్బీఐని కోరే అవకాశమున్నదని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ (BOFA) తెలిపింది.

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోడీ సర్కార్‌ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు 10 శాతం విలువైన ఉద్దీపనలను ప్రకటించింది. ఈ 10 శాతంలో 7.3 శాతం నిధులను కేంద్రం వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకోగలదు. మిగిలిన 2.7 శాతం (రూ.6.8 లక్షల కోట్ల) నిధులను కేంద్రానికి సమకూర్చేందుకు రిజర్వు బ్యాంకు నగదును ముద్రించాల్సిన అవసరముందని భావిస్తున్నాం’ అని BOFA ఒక ప్రకటనలో తెలిపింది. LTRO (లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌), TLTRO (టార్గెటెడ్‌ లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌), క్యాష్‌ రెపోరేట్‌ (CRR‌) కుదింపు, రుణ మార్గాల ద్వారా రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఈ మొత్తంలో పావు భాగం (250 బేసిస్‌ పాయింట్ల) నిధులను కేంద్రానికి సమకూర్చిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం రూ.4.2 లక్షల కోట్ల విలువైన అదనపు రుణాలను పొందేందుకు వెసులుబాటు ఉన్నట్టు తెలిపింది. ఈ రుణాల విలువ జీడీపీలో 110 బేసిస్‌ పాయింట్లగా తెలిపారు. పీఎస్‌యూ బాండ్లను జారీచేసే అవకాశం  ఉన్నదని, విలువ జీడీపీలో 50 బేసిస్‌ పాయింట్ల వరకు ఉంటుందని అన్నారు. చిన్న, మధ్యతరహా సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (NBFC)లకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వమిచ్చే క్రెడిట్‌ గ్యారంటీలు జీడీపీలో 150 నుంచి 200 బేసిస్‌ పాయింట్లకు సమానమని అన్నారు. మిగిలిన 270 బేసిస్‌ పాయింట్లకు సమానమైన నిధులను కేంద్రానికి సమకూర్చేందుకు ఆర్బీఐ నగదును ముద్రించాల్సిన అవసరముందని తెలిపారు. జీడీపీలో 80 బేసిస్‌ పాయింట్లకు సమానమైన నిధులను సంక్షేమ చర్యలకు వెచ్చించినట్టు తాజా ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే ఆర్బీఐ ప్రధాన విధి. అదనపు నగదు ముద్రణతో రూపాయి విలువ మరింత క్షీణించి ధరలు పెరుగుతాయి. దీంతో ద్రవ్యోల్బణం హద్దులు దాటి దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమై ముప్పు వాటిల్లుతుంది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు 1994లో మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడే నగదు ముద్రణ విధానానికి స్వస్తి పలికింది. కానీ, కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం నగదు ముద్రణ కోసం ఆర్బీఐని ఆశ్రయించక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆర్బీఐ నగదును ముద్రించి తక్కువ వడ్డీతో కేంద్రానికి ఇవ్వడాన్ని హెలిప్టర్‌ మనీ అంటారు.

వస్తు, సేవల కొనుగోలులో ప్రజలకు అసాధారణ రీతిలో సాధికారతను కల్పించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ‘హెలికాప్టర్‌ మనీ’ తోడ్పడుతుంది. హెలికాప్టర్‌ మనీతో కరెన్సీ నోట్ల సంఖ్య పెరిగి మార్కెట్లోకి మరింత నగదు వస్తుంది. ప్రభుత్వ బాండ్లను కొనుగోలుచేసి ఆర్బీఐ నిధులను సమకూర్చడాన్ని క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అంటారు. ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలంపాటు బాండ్లను సమీకరించేందుకు రిజర్వు బ్యాంకు అనుమతిస్తుంది. 

అమెరికా, జపాన్‌, యూరప్‌లోని మరికొన్ని ధనిక దేశాలతోపాటు టర్కీ, ఇండోనేషియా లాంటి దేశాలు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాప్టర్‌ మనీపై దృష్టిసారించాయి. నగదు ముద్రణతో తమ ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దుకొనేందుకు చర్యలు చేపడుతున్నాయి. యూరోజోన్‌లోని దేశాల నుంచి కొనుగోలుచేసే బాండ్లపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు పరిమితిని ఎత్తేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ తమ ప్రభుత్వానికి తాత్కాలికంగా రుణాలను అందజేసేందుకు సిద్ధమైంది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ అపరిమితంగా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. 

Read Here>>> దేశమంతా ఒకే కనీస వేతనం.. ఆగస్టులో వన్‌ నేషన్ – వన్ రేషన్