Krishnaiah Murder Case: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు నిందితులు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన తెరాస నేత తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్యచేసిన విషయం విధితమే. ఈ ఘటన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
- Harish Thanniru
- Updated on- August 18, 2022 / 09:33 AM IST
Tammineni Krishnaiah
Krishnaiah Murder Case: ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన తెరాస నేత తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్యచేసిన విషయం విధితమే. ఈ ఘటన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజకీయ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈనెల 15న ఉదయం తెల్దారుపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడైన తమ్మినేని కోటేశ్వరరావు ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని కృష్ణయ్య కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపించారు. అదేరోజు కృష్ణయ్య అనుచరులు కోటేశ్వరరావు ఇంటిపై దాడికి దిగారు. అయితే.. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి వారికోసం గాలిస్తున్నారు.
హత్యకేసులో ప్రమేయమున్న ఆరుగురు నిందితులను గురువారం తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏ2 రంజాన్, ఏ4 గంజి స్వామి, ఏ5 నూకల లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 ఎల్లంపల్లి నాగయ్యలు ఉన్నారు. అయితే ప్రధాన నిందితులైన ఏ1 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ3 జక్కంపూడి కృష్ణలు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీకోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
