Sri Mukha Lingeshwar : చెట్టు మొదలుగా కొలువైన..శ్రీ ముఖ లింగేశ్వరుడు…
శ్రీముఖ లింగంలోని మధుకేశ్వరాలయంలో శివలింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలు నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఇప్ప చెట్టును సంస్కృత భాషలో మధుకం అంటారు.
- Guntupalli Ramakrishna
- Published On : July 13, 2021 / 04:39 PM IST
చెట్టు మొదలే లింగావతారంగా..శ్రీ ముఖ లింగేశ్వరుడు.
Sri Mukha Lingeshwar : చరిత్ర పసిద్ధి చెందిన దేవాలయాల్లో శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలం శ్రీముఖ లింగం గ్రామంలో ఉన్న మధుకేశ్వరాలయం ఒకటి. దీనిని అంతా పిలిచే పేరు శ్రీముఖ లింగం. ఈ ఆలయం క్రీ.శ.573-1058 మధ్య కాలంలో నిర్మించి ఉండవచ్చని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చాణుక్య శిల్పకళా వైభవానికి ఈ ఆలయం అద్దంపడుతుంది. శ్రీ ముఖ లింగ ఆలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్ధంలో కళింగ రాజు రెండవ కామార్ణవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.
శ్రీముఖ లింగంలోని మధుకేశ్వరాలయంలో శివలింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలు నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఇప్ప చెట్టును సంస్కృత భాషలో మధుకం అంటారు. అందుకే దీనిని మధుకేశ్వరాలయంగా అంతా పిలుస్తారు. ఈ ఆలయంలో గర్భాలయంతోపాటు ఎనిమిది దిక్కులా ఎనిమిది లింగాలున్నాయి. ఈ ఆలయానికి అభిముఖంగా భీమేశ్వర ఆలయం ఉండగా , మరికొంత దూరంలో సోమేశ్వర ఆలయం కొలువై ఉంది.
శ్రీముఖ లింగ ఆలయంలో చారిత్రక శిల్పకళా సంపద చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. శివపార్వతుల శిల్పాలతోపాటు, గణపతి, సూర్యభగవానుడు, విష్ణుమూర్తి, వరాహిదేవి తదితర దేవతల శిల్పాలు అందగా మలచడి ఉన్నాయి. ప్రస్తుతం శ్రీముఖ లింగం ఆలయం నిర్వాహణను పురువస్తు శాఖ చూస్తోంది. ఆలయం చుట్టూ క్యూ కాంప్లెక్స్ తోపాటు, సుందరమైన పార్కును పురావస్తుశాఖ ఏర్పాటు చేసింది. శ్రీముఖ లింగం ఆలయాన్ని దర్శించేందుకు ఆంధ్ర, తెలంగాణాల రాష్ట్రాలతోపాటు ఒరిస్సా రాష్ట్రం నుండి భక్తులు, యాత్రికులు తరలివస్తుంటారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 45కిలో మీటర్ల దూరంలో ఈ శ్రీముఖ లింగ క్షేత్రం ఉంది.
