Tata Motors : వాహనాల తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగటంతో వాహన కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. ప్రముఖ దేశీయ వాహన తయరీ కంపెనీ టాటా మోటార్స్ ఇప్పటికే పలు మార్లు వాహనాల ధరలు పెంచగా, తాజాగా మరోసారి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలన్న ఆలోచన చేస్తుంది. పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల కారణంగా వ్యయాన్ని తగ్గించుకునేందుకు చార్జీల పెంపు తప్ప వేరే మార్గంలేదన్న అభిప్రాయంలో టాటా మోటార్స్ ఉంది.
వచ్చే వారంలో ధరల పెంపు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ముడిసరుకుల ధరలు జూన్ మాసంలో తగ్గుతాయని అంచనావేసినప్పటికీ వాటి ధరలు తగ్గకపోగా పెరుగుతుండంతో ఖర్చులు అధికమయ్యాయి. ఏడాది కాలంలో ఉక్కు ధరలు 50శాతం పెరగటం ఒకింత ధరల పెరుగుదలకు కారణం. ఉక్కుతోపాటు, వాహనాల తయారీలో వినియోగించే ఇతర లోహ పరికారాలు వ్యయం పెరిగిందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. పెరగనున్న ప్యాసింజర్ వాహనాల ధరల వివరాలను త్వరలోనే టాటా మోటార్స్ వెల్లడించనుంది.