Telangana Food: బీజేపీ సభకోసం తెలంగాణ రుచులు.. స్పెషల్ ఐటమ్స్ చేయనున్న యాదమ్మ
జూలై 2,3 తేదీల్లో నగరంలోని నోవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతోపాటు, బీజేపీకి చెందిన జాతీయ స్థాయి కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ వంటలను రుచి చూపించాలని నిర్ణయించారు.
- Narender Thiru
- Published On : June 30, 2022 / 10:24 AM IST
Telangana Food
Telangana Food: హైదరాబాద్లో జరగబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అతిథులకు అద్భుతమైన తెలంగాణ వంటలు రుచి చూపించబోతున్నారు. జూలై 2,3 తేదీల్లో నగరంలోని నోవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతోపాటు, బీజేపీకి చెందిన జాతీయ స్థాయి కీలక నేతలు హాజరవుతున్నారు.
Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?
ఈ సందర్భంగా వారికి తెలంగాణ వంటలను రుచి చూపించాలని నిర్ణయించారు. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్లో సభ జరిగే ఆదివారం రోజు ప్రత్యేకంగా తెలంగాణ వంటలు వడ్డించనున్నారు. దీనికోసం తెలంగాణ వంటల్ని అద్భుతంగా చేయగలిగే యాదమ్మను ఎంపిక చేశారు నిర్వాహకులు. కరీంనగర్ జిల్లాకు చెందిన యాదమ్మ 29 ఏళ్లుగా వంటలు చేస్తోంది. అందులోనూ తెలంగాణ ప్రత్యేక వంటలు చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. గతంలో పలు రాజకీయ సభల సందర్భంగా తెలంగాణ వంటలు చేసి ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. పది వేల మందికైనా వండగలిగే నైపుణ్యం ఆమె సొంతం. అందుకే యాదమ్మను బీజేపీ ప్రత్యేకంగా ఎంపిక చేసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో, ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, ఇతర నేతలు బుధవారం సమావేశమయ్యారు.
Auto Catches Fire: ఆటోపై విద్యుత్ తీగలు పడి.. ఐదుగురు సజీవ దహనం
ఈ సందర్భంగా వంటల ఏర్పాట్లపై చర్చించారు. యాదమ్మతోపాటు స్టార్ హోటల్ చెఫ్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వంటలు, వాటికి అవసరమైన సామగ్రి, తయారీ వంటి అంశాల్ని చెఫ్స్, యాదమ్మ నుంచి తెలుసుకున్నారు. సర్వపిండి, ముద్దపప్పు, పచ్చి పులుసు, గంగవాయిలి పప్పు, భక్షాలు, మక్క గారెలు, ఉల్లి పకోడి, పంట గారెలు, బెల్లం పరమాన్నం, సేమియా పాయసం వంటివి వడ్డించనున్నారు. యాదమ్మ వంటలను ప్రధాని మోదీ కూడా రుచి చూడబోతున్నారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా శాకాహారం వంటలు సిద్ధం చేస్తారు.
