Telangana Electricity Employees : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద సోమవారం (ఆగష్టు 8,2022) మహాధర్నా చేపట్టారు. ఈధర్మాకు విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఈక్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టంతో వినియోగదారులకే తీవ్ర నష్టమని..తెలిపారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడితే.. పూర్తిగా విధులను బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈ బిల్లుతో అనేక సమస్యలు వస్తాయని.. అసలు విద్యుత్ రంగాన్నే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరించేందుకు సిద్ధమవుతోందంటూ ఆరోపించారు.