TRS public meeting in munugodu : తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టే తిరుగుతోంది. మునుగోడులో తమ పార్టీయే మొనగాడు అనిపించుకోవటానికి అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో పాటు మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నిక రావటానికి కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్న క్రమంలో కాంగ్రెస్ కు కూడా మనుగోడు ప్రతిష్టాత్మకంగా మారింది. అలాగే తెలంగాణలో పట్టు నిలుపుకోవటానికి బీజేపీ పావులు కదుపుతున్న క్రమంలో బీజేపీకి కూడా మునుగోడులో గెలుపు తప్పనిసరిగా ఉంది. దీంతో మూడు పార్టీలో పోటా పోటీగా బహిరంగ సభలు నిర్వహించి సత్తా చాటాలనుకుంటున్నాయి. దీంట్లో భాగంగా రేపు అంటే శనివారం (ఆగస్టు 20,2022)న టీఆర్ఎస్ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుఅవుతారు. మరి ఈ సభా వేదికపైనుంచి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థిని ప్రటిస్తారా? ప్రకటిస్తే ఆ అభ్యర్థి ఎవరు? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది..ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్తు కానుంది…ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక జరుగుతుంది కాబట్టి మూడు పార్టీలు తమ బలాబలాలను చాటుకోవటానికి ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలో నిలపటానికి యత్నిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక జరుగుతున్న క్రమంలో అసంతృప్తులను చల్లార్చే పని పెద్ద టాస్క్ లాగానే ఉంది మూడు పార్టీలకు కూడా.
ఈ ఉపఎన్నికల్లో సత్తా చాటితేనే…సాధారణ ఎన్నికల్లో కూడా సత్తా చాటగలమని మూడు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే మూడు ప్రధాన పార్టీలు మునుగోడు ఉపఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ కీలక ఎత్తుగడలు వేస్తోంది.
రేపు మునుగోడు నియోజక వర్గంలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో..బహిరంగ సభకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సభకు లక్షకు తగ్గకుండా జనాలు రావాలని కేసీఆర్ ఆదేశించారట. మరి ఈ సభవేదిక నుంచి సీఎం కేసీఆర్ మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తారా? అనే ఆసక్తి నెలకొంది.