AP Weather: అలెర్ట్.. మరో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రత!
ఒకపక్క కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న ఏపీ ప్రజలను మరోవైపు ఎండలు అల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత తీవ్రంగా ఉంది.
- Naresh Mannam
- Published On : June 2, 2021 / 05:20 PM IST
Summer Heat
AP Weather: ఒకపక్క కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న ఏపీ ప్రజలను మరోవైపు ఎండలు అల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత తీవ్రంగా ఉంది. రుతుపవనాల రాకతో కాస్త వాతావరణం చల్లబడుతుందని భావిస్తుండగా అవి మరికాస్త ఆలస్యంగా ప్రవేశిస్తున్నాయి. రుతుపవనాలు మే 31న కేరళలో ప్రవేశిస్తాయని భావించినా ఆలస్యమైంది. కాగా.. ఇప్పుడు ఏపీలో మరికాస్త ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రానున్న రెండు మూడు రోజులలో ఏపీలో ఉష్ణోగ్రతలు మరో మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్రత ఈ నెల 8 వరకు కొనసాగే అవకాశం కూడా ఉందని.. రుతుపవనాలు ఆలస్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలలో 34 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
