Terrorists firing in Kashmir : కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఇద్దరు అన్నదమ్ములపై ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి
కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాల్పులతో విరుచుకుపడ్డారు. కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇద్దరు అన్నదమ్ములపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
- nagamani
- Published On : August 16, 2022 / 01:45 PM IST
Terrorists firing in Kashmir
Terrorists firing in Kashmir : కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాల్పులతో విరుచుకుపడ్డారు. కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇద్దరు అన్నదమ్ములపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. షోపియాన్ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తూటాలు తగిలిన వారు మైనారిటీ వర్గానికి చెందిన వారిగా కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. షోపియాన్, చోటిపోరా ప్రాంతంలోని ఆపిల్ పంట్ల తోటలో స్థానికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆయా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
మృతుడిని సునీల్కుమార్గా గుర్తించారు. ఈ కాల్పులను గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. మృతుడి కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..షోపియాన్లో పౌరులపై జరిగిన తుచ్ఛమైన ఉగ్రదాడి దారుణమని..ఈ ఘటన బాధ కలిగిస్తోందని అన్నారు. నా ఆలోచనలు సునీల్ కుమార్ కుటుంబంతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. . ఈ దాడిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. ఇటువంటివి అనాగరికమైనవని అన్నారు.
ఈ కాల్పుల ఘటనపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా విచారం వ్యక్తం చేశారు. షోపియాన్లో లక్ష్యంగా జరిగిన హత్య గురించి వినడానికి చాలా బాధాకరమని చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. జమ్ము కశ్మీర్ లో పౌరులు ప్రశాంతకమరైన జీవన విధానం గడపాలను కోరుకుంటున్నామని సాధారణ స్థితి రావాలని కోరుకుంటున్నామన్నారు. కాగా కశ్మీర్ లో మూడు రోజుల క్రితం కాశ్మీర్లోని బందిపొరా జిల్లాలో బీహార్కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
