Yadadri Temple: విద్యుత్ దీపాల ధగధగలు.. గోల్డెన్ టెంపుల్లా యాదాద్రి!
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకొని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆలయ అభివృద్ధి పనులు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా గత ఏడాది నుండి కరోనా ప్రభావంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
- Naresh Mannam
- Updated on- June 11, 2021 / 12:11 PM IST
The Glow Of Electric Lights Yadadri Is Like A Golden Temple
Yadadri Temple: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకొని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆలయ అభివృద్ధి పనులు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా గత ఏడాది నుండి కరోనా ప్రభావంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మళ్ళీ త్వరితగతిన పనులను మొదలుపెట్టగా ప్రస్తుతం యాదాద్రి ఆలయం దేదీప్యమానంగా వెలుగొందేందుకు సిద్ధమైంది.
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మహా దివ్యంగా రూపొందించే క్రమంలో సరికొత్త విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయం చుట్టూ మొత్తం 160 నూతన బ్యాలెట్ లైట్లను బిగించగా ఆ విద్యుత్ దీపాలను మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు యాడా అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక దీపాలంకరణ పనుల్లో భాగంగా అధికారులు తాజాగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కొత్త లైటింగ్ తో యాదాద్రి క్షేత్రం ప్రధానాలయం గోల్డెన్ టెంపుల్ తరహాలో స్వర్ణ కాంతులు విరజిమ్ముతోంది.
ఆలయం నలువైపులా మాడ వీధుల్లో అల్యూమినియం, ఇత్తడి లోహంతో తయారైన ఈ 160 లైట్లు యాదాద్రి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్నాయని అధికారులు చెప్తున్నారు. గురువారం రాత్రి సమయంలో ఈ ట్రయల్ రన్ నిర్వహించగా ఆలయం బంగారు వర్ణంతో విద్యుత్ కాంతులు వెదజల్లగా.. ఆలయ గోపురాలు, మండపాలు స్వర్ణ కాంతుల ధగధగలతో చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. కాగా.. మరికొన్ని రోజులలోనే అభివృద్ధి పనులు పూర్తయి భక్తులకు అందుబాటులోకి రానుంది.
