Rythu Bandhu: రైతు బంధు తాజా జాబితాలను సిద్ధం చేస్తున్న రెవెన్యూశాఖ!
దేశంలో మరెక్కడా లేనివిధంగా ఎకరాల లెక్కన రైతులకు ఆర్ధిక చేయూతనిస్తూ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా చాలా రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు అమలవుతున్నా.. ఎన్ని ఎకరాలున్న రైతైనా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల సాయం అందించడం మాత్రమే ఒక్క తెలంగాణలోనే సాధ్యమవుతుంది.
- Naresh Mannam
- Published On : May 31, 2021 / 12:05 PM IST
Rythu Bandhu
Rythu Bandhu: దేశంలో మరెక్కడా లేనివిధంగా ఎకరాల లెక్కన రైతులకు ఆర్ధిక చేయూతనిస్తూ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా చాలా రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు అమలవుతున్నా.. ఎన్ని ఎకరాలున్న రైతైనా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల సాయం అందించడం మాత్రమే ఒక్క తెలంగాణలోనే సాధ్యమవుతుంది. 2018 వానాకాలం(ఖరీఫ్) సీజన్ నుంచి ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో ఏడాదికి రెండు పంటల చొప్పున ఒక్కోపంటకు తొలిసారి ఎకరానికి రూ.4 వేలు ఇచ్చారు.
2019 వానాకాలం నుంచి ఎకరాకు రూ.5 వేలకు పెంచగా ఇప్పుడు ఏడాదికి రెండు పంటలకు కలిపి ఎకరాకు పదివేల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమవుతున్నాయి. 2018 నుండి ఈ ఏడాది మార్చి వరకూ 6 పంట సీజన్లకు మొత్తం రూ.35,911 కోట్లను ప్రభుత్వం జమ చేయగా ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి మొత్తం రూ.14,800 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. గత యాసంగిలో 59,25,725 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయగా ఇప్పుడు రైతుల సంఖ్య 60 లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా.. ఇప్పుడు వచ్చే వానాకాలం, యాసంగి పంటలకు గాను రైతుబంధుకు అవసరమైన జాబితాను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. వ్యవసాయ సిద్ధం చేసే రైతుల తాజా జాబితాలను రెవెన్యూశాఖ పరిశీలించి అక్కడ నుండి అవి జూన్ 10కల్లా జాతీయ సమాచార కేంద్రానికి(NIC)కి అందజేస్తుంది. అక్కడ నుండి నిధులు విడుదల చేస్తే అవి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలలో జమకానున్నాయి. ఇక రాష్ట్రంలో లక్షన్నర మంది రైతులు సరైన పత్రాలు అందించక ఈ రైతు బంధు అందడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తుండగా వారంతా పత్రాలు అందించి సాయాన్ని పొందాలని కోరుతుంది.
