75th Independence Day: జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి.. లేకుంటే కఠిన శిక్షలు..
దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆగస్టు 15 ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. హర్ ఘర్ తిరంగా ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది.
- Harishth Thanniru
- Published On : August 10, 2022 / 12:34 PM IST
National flag
75th Independence Day: దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆగస్టు 15 ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. హర్ ఘర్ తిరంగా ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. ఇదిలాఉంటే ఆజాదీ కా అమృతోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమికొట్టిన వారిలో ముఖ్యులను గుర్తు చేసుకుంటూ ఈ 75ఏళ్ల కాలంలో దేశం ఏ విధంగా అంచలంచెలుగా అభివృద్ధి చెందిందనే విషయాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తావిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం తేదీ దగ్గరపడుతున్న కొద్దీ దేశ ప్రజల్లో దేశభక్తి ఉరకలేస్తోంది. మరోవైపు ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంటింటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
indian flag
ఆగస్టు 15న ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేసే క్రమంలో ప్రజలు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని మరోవైపు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. త్రివర్ణ పతాకాన్ని అవమానించేలా ప్రవర్తిస్తే కఠిన జైలు శిక్షలు కూడా ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. జాతీయ జెండా ఉపయోగించే సమయంలో ఫ్లాగ్ కోడ్ 2002 నిబంధనలను పాటించాలి. జెండాను ఉపయోగించే విధానంలో ఫ్లాగ్ కోడ్ను ఉల్లంఘించినట్లైతే చట్టం రూపొందించిన ప్రకారం శిక్షలు, జరిమానాలను విధిస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా జాతీయ జెండాను అవమానపరిచినా, అగౌరవపరిచినా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముంది.
Telangana
ఈ నియమాలు ప్రతీఒక్కరూ పాటించాలి
– జాతీయ జెండాను అత్యంత గౌరవప్రదంగా చూసుకోవాలి.
– జెండాను ఎగురవేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అది చిరిగిపోయి, నలిగిపోయి, పాతగా ఉండకూడదు.
– మూడు వర్ణాలు, అశోక చక్రం తప్ప మరే వర్ణాలు, రాతలు ఉండకూడదు. కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలి.
– నిలువుగా జాతీయ జెండాను ప్రదర్శించే సమయంలో కాషాయం రంగు ఎడమ వైపున ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడిన జెండాను ఎగురవేయకూడదు.
– జెండా వందన సమయంలో త్రివర్ణ పతాకానికి సరిసమానంగానూ, దానికన్నా ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు.
– జాతీయ జెండాను నేల మీద అగౌరవప్రదంగా పడేయకూడదు.
– వివిధ అలంకరణ సామగ్రిగా జాతీయ జెండాను ఉపయోగించరాదు.
– పబ్లిక్ మీటింగుల్లో, సమావేశాల్లో స్టేజ్ పైన కుడి వైపున మాత్రమే (ప్రేక్షకులకు ఎడమ వైపుగా) జెండాను నిలపాలి.
– జెండాపై ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదు.
