Infosys Narayana Murthy On Childrens Death in Gambia : భారత్లో తయారైన దగ్గుమందు తీసుకుని ఆఫ్రికాలోని జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారని ఆఫ్రికా ఆరోపించటం భారతదేశానికి సిగ్గుచేటు అంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. బెంగళూరులో మంగళవారం (నవంబర్ 15,2022) నిర్వహించిన ఇన్ఫోసిస్ సైన్స్ పురస్కారాల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్లో తయారైన దగ్గుముందు గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైందని ఆఫ్రికా ఆరోపించడం భారత్కు సిగ్గుచేటని ఇది భారత్ కు తీరని అవమానం అని అన్నారు.
కరోనా టీకాలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసి.. గొప్ప పేరు తెచ్చుకున్న భారత్ కు దగ్గుమందు అపవాదు రావటం అనేది సిగ్గుచేటని అన్నారు. శాస్త్రీయ పరిశోధన రంగంలో దేశం గణనీయమైన సవాళ్లను కలిగి ఉన్న భారత పరిశోధన రంగానికి మచ్చ అన్నారు. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న గున్యా, డెంగీలకు ఇప్పటి వరకు టీకాలు కనుగొనకపోవడం పరిశోధన రంగం వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. విజ్ఞాన పరిశోధనల్లో సమన్వయ లోపంతోపాటు నిధులు పొందడంలో విద్యాసంస్థలు అవస్థలు పడుతున్నాయని,ప్రభుత్వ ప్రోత్సాహకాలను సకాలంలో పొందలేకపోతున్నాయని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా..ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాలను ఆరుగురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. వీరిలో సుమన్ చక్రవర్తి (ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్), సుధీర్ కృష్ణస్వామి (హ్యుమానిటీస్), విధిత వైద్య (లైఫ్ సైన్సెస్), మహేశ్ కాక్డే (గణితం), నిస్సీమ్ కనేకర్ (భౌతిక శాస్త్రం), రోహిణి పాండే (సోషల్ సైన్స్)లకు పురస్కారాలు ప్రకటించారు. విజేతలకు స్వర్ణ పతకంతోపాటు లక్ష అమెరికన్ డాలర్లు ఇస్తారు. ఈ ఏడాది మొత్తం 218 నామినేషన్లు రాగా వీరిని ఎంపిక చేశారు. జనవరిలో పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణన్ ప్రకటించారు.