Vinod Kumar Paul: ఇప్పుడే స్కూల్స్ తెరవడం మంచిది కాదు: నీతి ఆయోగ్ చైర్మన్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో సాధారణ కార్యకలాపాలకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో అన్ని రంగాలలో సాధారణ పరిస్థితులు నెలకొనగా పలు రాష్ట్రాలు పాఠశాలల ప్రారంభానికి కూడా సన్నాహాలు మొదలుపెట్టనున్నాయి.
- Naresh Mannam
- Published On : June 23, 2021 / 07:01 AM IST
Vinod Kumar Paul
Vinod Kumar Paul: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో సాధారణ కార్యకలాపాలకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో అన్ని రంగాలలో సాధారణ పరిస్థితులు నెలకొనగా పలు రాష్ట్రాలు పాఠశాలల ప్రారంభానికి కూడా సన్నాహాలు మొదలుపెట్టనున్నాయి. అయితే.. దీనిపై పలువురు నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడే పిల్లలను బయటకి పంపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన నీతి ఆయోగ్ చైర్మన్ వినోద్ కుమార్ పాల్.. కరోనా అసలు పరిస్థితి ఏంటో ఇప్పటికి ఇంకా పూర్తిగా సమాచారం లేకుండా ఇప్పుడే స్కూల్స్ తెరవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఒకవిధంగా ఇది ప్రాణాలను పణంగా పెట్టడమేనన్నారు.
స్కూల్స్ లో విద్యార్థులు, టీచర్లు, హెల్పర్లు అందరూ ఒకేచోట ఉండాల్సి వస్తుందని.. ఇది వైరస్ వ్యాప్తికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ అందించే పెద్దవారిలో కనీసం ఎక్కువ మందికి ఇచ్చిన అనంతరం.. పిల్లలలో కొంతభాగమైనా వ్యాక్సినేషన్ ఇచ్చిన అనంతరమే స్కూల్స్ రీఓపెన్ చేయడం మంచిదని పేర్కొన్నారు. మరి వీకే అభిప్రాయాలపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.
