Siddarth Nandyala
Siddarth Nandyala : ప్రస్తుత ఆధునిక జీవితంలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా పెరుగుతున్నాయి. చాలామందికి తమకు గుండెజబ్బులు ఉన్నాయనేది కూడా తెలియని పరిస్థితి. వయస్సుతో సంబంధం లేకుండా అందరిలో ఈ గుండెజబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి యువత ఈ గుండెజబ్బుల బారిన ఎక్కువగా పడుతున్నారు. ముందుగానే ఈ గుండెజబ్బులను గుర్తించి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చు. కానీ, ఈ గుండె జబ్బులను నిర్ధారించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ గుండె సంబంధిత వైద్య పరీక్షలను కార్డియాలిజిస్టుల పర్యవేక్షణలో నిర్వహిస్తుంటారు.
స్మార్ట్ఫోన్తో సెకన్ల వ్యవధిలో హార్ట్ స్ర్కీనింగ్ పరీక్షలు :
కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన 14 ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ నంద్యాల.. ఈ హార్ట్ స్ర్కీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నాడు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఓపీ విభాగంలోని హృదయ రోగులకు హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కేవలం స్మార్ట్ఫోన్తోనే హార్ట్ స్ర్కీనింగ్ చేయడం అందరిని ఆకర్షిస్తోంది. తానే స్వయంగా రూపొందించిన ఏఐ యాప్ సాయంతో ఈ గుండె పరీక్షలను నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం సిర్కాడియావీ అనే యాప్ స్మార్ట్ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏఐ యాప్ ద్వారా రోగి ఛాతిపై 7 సెకన్లపాటు ఉంచితే చాలు.. ఆ యాప్ హార్ట్ రేట్ రికార్డు చేస్తుంది. ఒకవేళ ఆ రోగికి గుండె జబ్బు ఉంటే.. బీప్ సౌండ్ చేస్తూ రెడ్ లైట్ వెలుగుతుంది. అప్పుడు అందులో గ్రాఫిక్ ‘అబ్నార్మల్ హార్ట్ బీట్’ అంటూ రిపోర్టు కనిపిస్తుంది.
ఇప్పటివరకూ జీజీహెచ్ ఓపీలో దాదాపు 500 మందికి హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. అందులో 10 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు తేలింది. వారికి ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలు కూడా చేయగా.. గుండె జబ్బులు ఉన్నట్లు నిర్ధారించారు. సిద్ధార్థ్ శిక్షణలో 6 నర్సులు ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సిద్ధార్థ్ నంధ్యాల ఎవరంటే? :
ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సర్టిఫైడ్ ఏఐ టెకీగా గుర్తింపు పొందిన సిద్ధార్థ్ నంధ్యాలది అనంతపురం జిల్లా. 2010లో వీరి కుటుంబం అమెరికాలో స్థిర పడింది. సిద్ధార్థ్ తండ్రి మహేశ్ అమెరికాలో పెద్ద వ్యాపారవేత్తగా ఉన్నారు. చిన్నప్పటినుంచి చదువులో బాగా చురుకుగా ఉండేవాడు. డీఎంఈ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో బ్యాచ్లర్ ఆఫ్ ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు.
12 ఏళ్ల వయస్సులోనే మెడికల్ కోడింగ్పై గట్టి పట్టు సాధించాడు. వైద్య రంగంలో నూతన ఏఐ ఆధారిత డివైజ్ల తయారీపై సిద్ధార్థ్ ఫోకస్ పెట్టాడు. తద్వారా సిర్కాడియావీ అనే ఏఐ యాప్ ఆవిష్కరించాడు. మొదట్లో ఈ ఏఐ యాప్ సాయంతో అమెరికాలో 15వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశాడు. అందులో 3,500 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు గుర్తించారు. 93 శాతం అక్యూరెన్సీతో ఈ ఏఐ యాప్ పనిచేస్తుందని చెబుతున్నాడు.
ఇటీవలే డల్లాస్లో సిద్ధార్థ్ నంద్యాల ఈ యాప్ గురించి వివరించారు. ఈ ఏఐ యాప్ ద్వారా జీజీహెచ్ రోగులకు పరీక్షించేందుకు మంత్రి పెమ్మసానిని కోరారు. జీజీహెచ్లో రోగులకు గుండె జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు అనుమతి తీసుకుని వెయ్యి మందికి పరీక్షలు పూర్తి చేశారు.
దీనికి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని సిద్ధార్థ్ తెలిపారు. ఏఐ యాప్ ద్వారా రూపొందించిన తన ప్రాజెక్ట్ గురించి వివరించేందుకు సీఎం చంద్రబాబును కలవనున్నట్టు చెప్పారు. కానీ, సీఎం అపాయింట్మెంట్ దొరకలేదని చెబుతున్నాడు. తన ప్రాజెక్టుపై అమెరికా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని, కానీ, సొంత రాష్ట్రానికి ఉపయోగపడాలని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.