Brushing : ఉదయంతోపాటు రాత్రి సమయంలో బ్రష్ చేసుకోవటం వల్ల నోటి సమస్యలకు చెక్!
రాత్రిపూట పళ్లను తోమడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పళ్లు తోముకోకపోతే నోటిలో బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. ఇది దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, చెడు శ్వాస వంటి సమస్యలకు దారితీస్తుంది.
- Guntupalli Ramakrishna
- Published On : September 19, 2022 / 11:52 AM IST
Brushing in the morning and at night checks oral problems!
Brushing : నోరు శుభ్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కోకక తప్పదు. ఉదయాన్నే కనీసం నాలుగు నిమిషాలపాటు బ్రష్ చేయాలి. నోటితో నీళ్లను పుక్కిలించడం, నాలుక శుభ్రపరచుకోవడం చేయాలి. ఇలా చేయటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అదేసమయంలో ఉదయంతోపాటు రాత్రి ఆహారం తీసుకున్న తరువాత నిద్రకు ముందు బ్రష్ చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. రాత్రిపూట పళ్లు తోముకోవడం అన్ని వయసుల వారికి మంచిది. రాత్రిపూట ఎక్కువసేపుకాకుండా మూడు నిమిషాల సమయం పళ్లను తోమితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
పళ్లను సరిగ్గా క్లీన్ చేయడం, దంతవైద్యులను తరచుగా సంప్రదించడం, కొన్ని రకాల ఆహారపు అలవాట్లను నియంత్రించడం వల్ల దంత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు వీటివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనదేంటంటే.. దంతాలను క్రమం తప్పకుండా క్లీన్ చేయడం. కొంతమంది ఉదయమే కాదు.. రాత్రి వేళ కూడా దంతాలను తోముతుంటారు. మరికొంతమంది మాత్రం ఉదయం ఒక్కసారే బ్రష్ చేస్తుంటారు. రాత్రి పూట బ్రష్ చేసుకోరు. దీనివల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట పళ్లను తోమడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పళ్లు తోముకోకపోతే నోటిలో బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. ఇది దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, చెడు శ్వాస వంటి సమస్యలకు దారితీస్తుంది. వీటితోపాటు గుండె జబ్బులు, డయాబెటీస్, మూత్రపిండాల అనారోగ్యం, చిత్తవైకల్యం వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉంటే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.
రాత్రిపూట పళ్ళు తోముకోకపోవడం చిగుళ్ల వ్యాధికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలిసి గుండెలోకి ప్రవేశిస్తుంది. ఇది సంక్రమణకు దారితీస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు దీనివల్ల శరీర సహజ రక్షణ యంత్రాంగాలకు అంతరాయం కలుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దంతాలపై పాచి పెరగకుండా చూసుకోవాలి. దంతాలకు సంబంధించిన సమస్యలొస్తే దంత వైద్యున్ని సంప్రదించాలి.
