Vomiting and Diarrhea : వేసవిలో వాంతులు,విరోచనాలతో శరీరం బలహీనంగా మారిందా?
కడుపులో నులినొప్పి అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో పెరుగు తినటం మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి
- Guntupalli Ramakrishna
- Published On : May 15, 2022 / 02:53 PM IST
Body Become Weak
Vomiting and Diarrhea : వేసవి కాలంలో అధిక వేడి కారణంగా జీర్ణ సంబంధమైన సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. వాంతులు, విరోచనాలు వంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సందర్భంలో శరీరం బలహీనంగా మారుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల కారణంగా వచ్చే వాంతులు, విరోచనాల విషయంలో సకాలంలో చికిత్స తీసుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య పరిస్ధితుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఎండవేడి కారణంగా శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. శక్తి సన్నగిల్లిన సందర్భంలో నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటి నుండి బయటపడేందుకు కొన్ని చిట్కాలను పాటించటం మంచిది. వీటిని పాటిస్తే శరీరంలో శక్తిని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది.
వేసవిలో నిమ్మరసం తప్పనిసరిగా తాగాలి. ఎండ వేడి నుండి ఇది రక్షిస్తుంది. వాంతులు, విరేచనాల సమస్యతో ఉన్నప్పటికీ నిమ్మరసం తాగొచ్చు. లెమన్ వాటర్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. నిమ్మరసంలో కొంచెం తేనె కూడా కలుపుకుంటే నీరసం తగ్గుతుంది. వాంతులు విరోచనాలు అవుతున్న సందర్భంలో ఉప్పు చక్కెర ద్రావణం తీసుకోవటం మంచిది. ఇది ఒక రకమైన ఎలక్ట్రోలైట్. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీని వల్ల అతిసారం త్వరగా తగ్గిపోతుంది. మీకు అతిసారం ఉంటే కనీసం ఉప్పు, చక్కెర నీటిని రోజుకు 2-3 సార్లు తాగాలి.
కడుపులో నులినొప్పి అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో పెరుగు తినటం మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది డయేరియాను సమస్య నుండి బయటపడేస్తుంది. పెరుగులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, చూర్ణం చేసిన పొడి పుదీనా కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. విరేచనాలు అయినప్పుడు పండిన అరటిపండును ఎక్కువగా తినాలి. అరటిపండులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే పచ్చిగా ఉన్న అరటి పండును తీసుకోకూడదు. పచ్చి అరటిపండు తినడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. పిల్లలకు విరేచనాలు, వాంతులు ఉంటే అరటిపండు ఇవ్వటం మంచిది.
