టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై కమిటీ

టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 984 విడుదల చేసింది. ఈ ప్యానెల్లో సినీ నటి సుప్రియ, నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినిరెడ్డిని టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది. అలాగే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మితో కమిటీ ఏర్పాటు చేసింది.

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన రావు, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సుధాకర్రెడ్డి కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రామ్మోహన రావు ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి మహిళలను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పొచ్చని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది.