Dhanush and Aishwarya patchup again news goes viral in Tamil Media
Dhanush-Aishwarya : సినీ పరిశ్రమలో ఇటీవల విడాకులు ఎక్కువైన సంగతి తెలిసిందే. పలువురు సినీ సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకున్నారు. ఈ కోవలోనే తమిళ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్య కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు. ధనుష్-ఐశ్వర్యలని కలపడానికి రెండు కుటుంబాలు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ధనుష్-ఐశ్వర్యలు తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. 18 ఏళ్ళ వివాహ బంధం తర్వాత వీరు విడిపోవడం కుటుంబ సభ్యులకే కాదు, అభిమానులకి కూడా ఆవేదనకు గురిచేసింది. విడిపోయిన తర్వాత ఒకసారి వీరి పిల్లల కోసం స్కూల్ ఈవెంట్లో కలిశారు వీరిద్దరు. అయితే తాజాగా తమిళ మీడియాలో వీరిద్దరూ మళ్ళీ కలవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల రజనీకాంత్ ఇంట్లో మరోసారి ధనుష్-ఐశ్వర్యని కూర్చోబెట్టి రెండు కుటుంబాలు మాట్లాడినట్టు సమాచారం. ఈ స్టార్ కపుల్ మధ్య సయోధ్య కుదిర్చారని, పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల కోసం కలిసి ఉండాలని చెప్పినట్టు, ఇందుకు ధనుష్-ఐశ్వర్య కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇరు కుటుంబాలలో ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఇదే నిజమైతే అంతకంటే ఆనందం ఇంకోటేముంది అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ జంట నిజంగానే కలుస్తారేమో చూడాలి.